Scientific speed limit for vehicles: జంట నగరాల్లో ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు అధికారులు ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా శాస్త్రీయ వేగ పరిమితి అమలుకు నిర్ణయించారు. జూబ్లీహిల్స్, మాదాపూర్లో గంటకు 80 కిలోమీటర్లు, అబిడ్స్లో 40 కిలోమీటర్లు, ఉప్పల్లో 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలన్న నిబంధనలు ఇకపై ఉండవు. వన్ వే.. టూ వే రహదారులపై వెళ్లే వాహనాలకు మాత్రమే వేగ పరిమితి ఉండనుంది. ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ రంగనాథ్, రాచకొండ, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రవాణా శాఖ అధికారులు సమామావేశమై సూత్రప్రాయంగా నిర్ణయించారు.
వేగ పరిమితి ఇలా..
Scientific speed limit for vehicles on Hyderabad roads: ప్రాంతంతో సంబంధం లేకుండా పీవీ ఎక్స్ప్రెస్వేపై గంటకు 80 కిలోమీటర్లు, బాహ్యవలయ రహదారిపై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వాహనదారులు ప్రయాణించేందుకు వీలుంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీల్లో ఎక్కడైనా సరే.. 35 కిలోమీటర్ల కంటే వేగంగా ఏ వాహనం వెళ్లకూడదని పోలీస్ అధికారులు తెలిపారు. కార్లు, జీపులు గంటకు 60 కిలోమీటర్లు.. బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని మార్గదర్శకాలు వెలువరించారు. వన్ వే మార్గాల్లోనైతే కార్లు, జీపులు 50 కిలోమీటర్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని సూచించారు.