హైదరాబాద్ పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు సవాళ్లు విసురుతున్నాయి. గతేడాది సంక్రాతి పండుగను టార్గెట్ చేసుకొని పదుల సంఖ్యలో ఇళ్లల్లో చోరీలు చేశారు. ఈ ఏడాది ఎక్కడ చోరీలు, దోపిడీలు జరగకుండా పోలీసులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి వరుస సెలవులు ఉన్నందున దొంగల ముఠాలు ఇప్పటికే సిటీలో రెక్కీ నిర్వహించాయని, మొన్న దొరికిన కరుడుగట్టిన చెడ్డి గ్యాంగ్ అరెస్ట్ తర్వాత పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు.
పగలు రాత్రి అని తేడా లేకుండా
ముఖ్యంగా శివారు ప్రాంతాలనే అడ్డాలుగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు తమ దోపిడీలను కొనసాగిస్తున్నారు. సంక్రాంతి సీజన్ మంచి సమయంగా ఎంచుకుని కాలనీల్లో ముఠాలు రెక్కీ నిర్వహిస్తాయి. తాళాలు ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పగలు రాత్రి అని తేడా లేకుండా చోరీలు చేస్తారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలు, పోలీసుల నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఇళ్లనే తమ చోరీలకు అనువైన ప్రాంతాలుగా ఎంచుకుంటారు. అయితే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదా పోలీస్స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళితే ఆ ఇంటిపై నిఘా ఉంచుతామంటున్నారు.
గతంలో చోటు చేసుకున్న ఘటనలపై
మరోవైపు ఈ పండుగ సమయంలో దొంగతనాల నియంత్రణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో చోటు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేసి ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి చోరీల నియంత్రణకు ప్రణాళిక రూపొందించారు. తాము ఎంత రెక్కీ నిర్వహించినా సొంత ఊళ్లకు వేళ్లే వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.