Sankranti Celebrations in Shilparamam 2024 : రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) ఘనంగా మొదలయ్యాయి. అవకాశం ఉన్నవారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా రంగురంగుల ముత్యాల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. లోగిళ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, భోగిపళ్లు, పిండి వంటలు, గాలిపటాలు, కొత్తబట్టలు, బొమ్మల కొలువులు, చెడుగుడు పోటీలు, పశువుల పందాలతో గ్రామాల్లో సందండి నెలకొంది.
అలా వెళ్లడం కుదరనివారు హైదరాబాద్లోనే జరుపుకుంటున్నారు. అలాంటి వాళ్లకు పల్లె అందాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది శిల్పారామం. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఎటుచూసినా మనసుకు ఉల్లాసాన్ని కలిగించే పచ్చని చెట్లు, ముత్యాల ముగ్గులు, బోటు షికారు ఒక్కటేమిటి, ఇలా అన్నీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లలేని వారు శిల్పారామానికి వచ్చి ఈ అనుభూతులను మనసారా ఆస్వాదిస్తున్నారు.
సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Sankranti Celebrations in Telangana 2024 :శిల్పారామంలో(Sankranti Celebrations in Shilparamam)మూడు రోజులపాటు నిర్వహించే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నగరవాసులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. హరిదాసు, గంగ దేవర, బుడు బుక్కుల ,పిట్టల దొర వేషధారులు భవిష్యత్ తరాలకు, సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ సందడి చేస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు తెలిసేలా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని సందర్శకులు చెబుతున్నారు. చిన్ననాటి మధురస్మృతులు గుర్తుకు వస్తున్నాయని, సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.