తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 1:58 PM IST

ETV Bharat / state

అలాంటి వారంతా పల్లె వెలుగు బస్సులు ఎక్కండి - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్పెషల్​ రిక్వెస్ట్

Sajjanar Tweet Appeal to Women in Telangana : తెలంగాణలోని మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ విజ్ఞప్తి చేశారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరారు. తక్కువ దూరం ప్రయాణించే వారు, ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కుతున్నారని పేర్కొన్నారు. తద్వారా దూర ప్రాంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సజ్జనార్ వివరించారు.

TSRTC
TSRTC

Sajjanar Tweet Appeal to Women in Telangana : మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్‌ ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు, ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కుతున్నట్టుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని తెలిపింది. తద్వారా ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంస్థ ఎండీ సజ్జనార్ ఎక్స్‌ (ట్విటర్) వేదికగా వెల్లడించారు.

ఈ సమస్యను అధిగమించేందుకు, తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని సజ్జనార్‌ (TSRTC MD Sajjanar) విజ్ఞప్తి చేశారు. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా, మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులు అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు.

దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వండి :అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఇందుకు సహకరిస్తున్న సిబ్బందికి, ప్రయాణికులందరికీ సజ్జనార్ ధన్యావాదాలు తెలిపారు.

కిక్కిరిసిన నిర్మల్​ బస్టాండ్​ - సీటు కోసం డ్రైవర్​ క్యాబిన్​ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు

Sajjanar on New Buses in Telangana : మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి నాటికి, 200 కొత్త డీజిల్ బస్సులను (New Buses ) టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో 50 బస్సులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది. హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణంలో, కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను సంస్థ ఎండీ సజ్జనార్ పరిశీలించారు.

ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను సజ్జనార్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి (Mahalakshmi Scheme) పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫథకాన్ని అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని సజ్జనార్ తెలిపారు.

ఉచిత ప్రయాణం ఆనందం అంటున్న మహిళలు - నష్టపోతున్నామంటూ ఆటోడ్రైవర్ల ఆవేదన

నాలుగైదు నెలల్లో 2,000లకు పైగా కొత్త బస్సులు : ఇందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2,000లకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. అందులో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి తెస్తామని వివరించారు. వీటిన్నింటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించామని సజ్జనార్ వెల్లడించారు.

ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ప్రయోజనం - మహాలక్ష్మి పథకంపై మహిళల ఆనందం

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు

ABOUT THE AUTHOR

...view details