Sajjanar Tweet Appeal to Women in Telangana : మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్ ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు, ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతున్నట్టుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని తెలిపింది. తద్వారా ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంస్థ ఎండీ సజ్జనార్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు.
ఈ సమస్యను అధిగమించేందుకు, తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని సజ్జనార్ (TSRTC MD Sajjanar) విజ్ఞప్తి చేశారు. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా, మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులు అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు.
దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వండి :అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఇందుకు సహకరిస్తున్న సిబ్బందికి, ప్రయాణికులందరికీ సజ్జనార్ ధన్యావాదాలు తెలిపారు.
కిక్కిరిసిన నిర్మల్ బస్టాండ్ - సీటు కోసం డ్రైవర్ క్యాబిన్ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు
Sajjanar on New Buses in Telangana : మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి నాటికి, 200 కొత్త డీజిల్ బస్సులను (New Buses ) టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో 50 బస్సులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో, కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ప్రెస్ బస్సులను సంస్థ ఎండీ సజ్జనార్ పరిశీలించారు.