తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బు కోసం పోలీసు అవతారం... ఆర్​ఎస్సై కుమారుడి ఘనకార్యం

ఒకరు ఆర్​ఎస్సై కుమారుడు, మరొకరు పలుకుబడి ఉన్న వ్యక్తికి సమీప బంధువు. ఇద్దరూ కలిసి డబ్బుకోసం అడ్డదారి తొక్కారు. ఓ విద్యార్థిని బెదిరించి ఒకరు గంజాయి తెప్పించుకోగా.. మరొకరు తాను పోలీస్‌నంటూ వచ్చి పట్టుకున్నారు. ఆ తర్వాత కేసుల పేరిట డబ్బు దండుకున్నారు. ఈ దొంగ పోలీస్‌ దందాలో పట్టుపడింది పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో పోలీసులు గప్‌చుప్‌ అయ్యారు.

By

Published : Oct 31, 2020, 12:56 PM IST

fake police gang in vijayawada
డబ్బు కోసం పోలీసు అవతారం... ఆర్​ఎస్సై కుమారుడి ఘనకార్యం

డబ్బు కోసం పోలీసు అవతారం... ఆర్​ఎస్సై కుమారుడి ఘనకార్యం

ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో ఓ కిడ్నాప్‌ కేసులో తీగలాగితే దొంగ పోలీస్‌ దందా డొంక కదిలింది. మొగల్రాజపురానికి చెందిన విద్యార్థి యోగేంద్ర సాయికి గంజాయి తాగడం అలవాటైంది. సింగ్‌నగర్​లో ఒక పూలమ్మే అమ్మాయి వద్ద మాల్‌ కొన్నాడు. ఎవరూ చూడలేదులే అనుకున్న సాయికి ఆ తర్వాత ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. తనకూ గంజాయి తెచ్చివ్వాలని, లేదంటే పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరింపు మొదలైంది. భయపడిన సాయి, వెయ్యి రూపాయలకు గంజాయి కొని మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కనకదుర్గ వారధి.. వద్దకు వెళ్లాడు. తాను లతీఫ్‌నంటూ ఒకవ్యక్తి అక్కడకు వచ్చాడు. గంజాయి తెచ్చావా అని అడిగాడు. లతీఫ్‌కు.. సాయి తన వద్ద ఉన్న ప్యాకెట్‌ తీసి ఇస్తుండగా ఒక బుల్లెట్‌ వాహనం అక్కడకు వచ్చి ఆగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌ దిగి తాము పోలీసులమంటూ బిల్డప్‌ ఇచ్చారు. ఈలోగా లతీఫ్‌ గంజాయి ప్యాకెట్‌తో పారిపోగా ఏం జరుగుతుందో తెలియని సాయి బిక్కమొహం వేశాడు. ఇద్దరు అతన్ని ఓ చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారు. రూ.3 లక్షలు ఇస్తే కేసుల్లేకుండా వదిలేస్తామని బేరం పెట్టారు. తన వద్ద రూ.2 వేలే ఉన్నాయని, వదిలేయాలని బతిమాలుకున్నాడు సాయి. అది లాగేసుకుని రూ.50 వేలు తేవాలంటూ దాడి చేసి వదిలేశారు.

ఈ విషయంపై సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ క్లూ కూడా అందించాడు. గంజాయి ప్యాకెట్‌ తీసుకుని పారిపోయిన లతీఫ్‌తో పాటు మరో ఇద్దరు.. తనను బంధించిన చోటుకు రావడంతో అతనికి విషయం అర్థమైంది. తమపై దాడిచేసిన వారిలో ప్రదీప్‌ అనే వ్యక్తీ ఉన్నాడని, అతనితో తనకు పాతగొడవలున్నాయని సాయి పోలీసులకు తెలిపాడు. పోలీసులు లతీఫ్‌తోపాటు ప్రదీప్ భానుప్రకాశ్, వినయ్ రాజన్, పవన్ కుమార్‌ను అరెస్టు చేశారు. కాకపోతే నిందితుల్లో ఇద్దరు ప్రముఖుల సంబంధీకులున్నారు. ఒకరు ఓ ఆర్​ఎస్సై కుమారుడు కాగా మరొకరు దుర్గగుడి పాలకమండలిలో కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తికి సమీప బంధువు. అందుకే ఏ చిన్నకేసైనా మీడియా సమావేశం పెట్టే పోలీసులు.. ఈ కేసులో గప్‌చుప్‌ అయ్యారు. నిందితుల పేర్లు బయటకు రాకుండా ఉంచేందుకు ప్రయత్నించారు. పై అధికారుల ఆంక్షలున్నాయంటూ.. కెమెరా ముందుకు వచ్చేందుకూ మొహంచాటేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆదివాసి బిడ్డకు అక్షర నీరాజనం..

ABOUT THE AUTHOR

...view details