తెలంగాణ

telangana

ETV Bharat / state

జాగా కనిపిస్తే చాలు... పాగా వేసేస్తున్నారు

భాగ్యనగరంలో భూదందా పెచ్చుమీరుతోంది. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి విలువైన భూములను స్వాహా చేస్తున్నారు. అధికారులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాపకింద నీరులా కోట్ల విలువైన భూమి చేజారిపోతోంది.

By

Published : Jan 8, 2021, 7:01 AM IST

జాగా కనిపిస్తే... పాగా వేసేస్తున్నారు
జాగా కనిపిస్తే... పాగా వేసేస్తున్నారు

ఫిలింనగర్‌లో ఖరీదైన స్థలంపై కొందరు ప్రజాప్రతినిధులు కన్నేశారు. చివరకు ఏపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హక్కు పొందారు. విలువైన భూమి చేజారడంతో ఇక్కడున్న ఓ ప్రజాప్రతినిధి అనుచరులతో హల్‌చల్‌ చేశారు. అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. గొడవ పెద్దది కావటంతో రాజీ కుదిర్చేందుకు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు.

బంజారాహిల్స్‌లో ఏళ్లతరబడి ఖాళీగా ఉన్న స్థలంపై ఓ ప్రజాప్రతినిధి కన్నుపడింది. అనుచరుడితో బోర్డు పాతించేశారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. హక్కు దారుడికి తెలిసినా పెద్దలతో గొడవెందుకని ఇచ్చినంత తీసుకొని స్థలం రాయించేసినట్లు తెలిసింది.

నగరంలో భూదందా తీరు తెలిపే ఉదాహరణలు మాత్రమే ఇవి. గతేడాది చైనా సరిహద్దులో వీరమరణం పొందిన మేజర్‌ సంతోష్‌కుమార్‌ కుటుంబానికి బంజారాహిల్స్‌లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. గతంలో ఈ స్థలాన్నీ కాజేసేందుకు యత్నించారు. అప్పటి ఆర్డీఓ చంద్రకళ కాపాడగలిగారు. షేక్‌పేట-శేరిలింగంపల్లి వెళ్లే మార్గంలో రూ.50 కోట్ల విలువైన స్థలం చుట్టూ కంచె వేసే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్‌ దృష్టికి వెళ్లటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌, గ్రేటర్‌ ఎన్నికల్లో అధికారులు నిమగ్నమై ఉండటాన్ని అవకాశంగా మలుచుకున్న అక్రమార్కులు ప్రభుత్వ భూ నిధి(ల్యాండ్‌బ్యాంకు)లో సుమారు 20-30శాతం ఆక్రమించుకున్నారు. గోల్కొండ ప్రాంతంలో రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కొందరు నేతల సాయంతో ఆక్రమించి నిర్మాణాలూ చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో రెండున్నర ఎకరాల స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.

ఇలా ఆక్రమణ యత్నం

భూ దందాలకు పాల్పడే ముఠాలు పక్కా ప్రణాళికతో పథక రచన చేస్తుంటాయి. కమీషన్లకు కక్కుర్తిపడే ఉద్యోగుల ద్వారా భూముల సమాచారం సేకరిస్తాయి. ‘హక్కుదారులం తామే’ అంటూ నకిలీ పత్రాలు సృష్టిస్తారు. కోర్టులను ఆశ్రయిస్తారు. వాటిని బూచిగా చూపి బెదిరింపులకు పాల్పడతారు. తక్కువ ధరకు స్థలాలను సొంతం చేసుకోవడానికి చూస్తారు. సహకరించని అధికారులను వేధిస్తారు. సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లోని మాటవినని ఓ తహసీల్దారును ఒక ప్రజాప్రతినిధి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేలా చేసినట్లు తెలిసింది.

రాత్రికి రాత్రే నిర్మాణాలు

● రెండేళ్ల క్రితం సేకరించిన భూనిధి లెక్కల ప్రకారం 235-240 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలున్నట్టు తెలుస్తోంది.

● హైదరాబాద్‌ జిల్లా పరిధిలో వివిధ కోర్టుల్లో 1200కు పైగా భూ వివాదాస్పద కేసులుంటాయి.

● షేక్‌పేట మండలంలోనే 700-800 కేసులున్నాయి.

● తిరుమలగిరి, కంటోన్మెంట్‌లోని భూములకు రికార్డులు లేకపోవటం కబ్జాదారులకు కలసి వస్తోంది.

● బండ్లగూడ, గోల్కొండ, అమీర్‌పేట్‌, ముషీరాబాద్‌ మండలాల పరిధిలో ఖరీదైన స్థలాలు తరచూ వివాదాల్లోకి చేరుతున్నాయి.

● వీఆర్‌ఓల వ్యవస్థను రద్దు చేయటంతో క్షేత్ర పరిశీలన అటకెక్కింది. ప్రభుత్వ భూముల్లో బోర్డులను తొలగించి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు.

సమన్వయం లేని శాఖలు

జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, దేవాదాయ, నీటిపారుదల శాఖల అధికారుల సమన్వయ లోపంతో విలువైన స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. గతేడాది ఆయా శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. సమన్వయంతో ప్రభుత్వ స్థలాలు కాపాడాలని ఆదేశించారు. అయినా.. గతేడాది షేక్‌పేట మండలంలోని భూ వివాదంలో రెవెన్యూ, పోలీసు అధికారులను అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది.

చర్యలు తీసుకుంటున్నాం

భూ వివాదాల విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. భూనిధి ఏర్పాటు చేసి పరిరక్షణ చర్యలు చేపడుతున్నాం. న్యాయపరమైన అంశాల పరిష్కారానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

- శ్వేతామహంతి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌

ఇదీ చూడండి:యాసంగి-2020 ఏడాదికి రైతులకు అందిన పెట్టుబడి సాయం వివరాలు..

ABOUT THE AUTHOR

...view details