ప్రపంచవ్యాప్తంగా వంద నగరాల్లో 2050వ సంవత్సరానికి తీవ్రమైన నీటికొరత తలెత్తే ముప్పు పొంచి ఉందని డబ్ల్యుడబ్ల్యుఎఫ్ (వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్) అధ్యయనంలో వెల్లడైందని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ తెలిపారు. ఆ నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ నగరం ఉండడం ఆందోళనకర అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఎంఎయూడి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్) కార్యదర్శికి లేఖ రాశారు. విశాఖలో నీటి కొరతకు దారితీసిన పరిస్థితులను, లేఖలోని వివరాలను ఆయన ‘ఈనాడు- ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
- విశాఖలో ఐదు రిజర్వాయర్లు ఉండగా వాటి పరీవాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురికావడం, నిర్మాణ కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతుండడం వల్ల రిజర్వాయర్లకు చేరే నీటి పరిమాణం క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా విశాఖలో ఉన్న ప్రస్తుత రిజర్వాయర్ల సామర్థ్యం 60శాతం తగ్గింది.
- విశాఖ నగర జనాభా పెరగడం వల్ల భూగర్భ జలాల వినియోగం కూడా గణనీయంగా పెరిగి నగరంలో వేసవి వచ్చిందంటే నెలలపాటు బోర్లు ఎండిపోయి నీటికి నానా అవస్థలు పడుతున్నారు.
- భూగర్భజలాల్ని భారీ ఎత్తున వినియోగిస్తున్నా ఆ మేరకు భూమిలోకి ఇంకించే కార్యక్రమాలు ఏమాత్రం చేపట్టడంలేదు. ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
- విశాఖ నగరానికి అనుకునే సముద్రం ఉన్నందున నగర భూగర్భంలోకి సముద్ర జలాలు భూమి పొరల గుండా క్రమంగా చొచ్చుకువస్తున్నాయి. ఫలితంగా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారిపోతోంది.
- విశాఖ నగరంలో సుమారు 150 వరకు సహజసిద్ధమైన చిన్నా,పెద్దా చెరువులు, ఇతర నీటివనరులు ఉండేవి. అందులో చాలా వరకు ఆక్రమణలకు గురికావడం, ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల విశాఖలో తీవ్రమైన నీటికొరత తలెత్తడానికి అవకాశాలు తలెత్తాయి.
- నగరంలోని రిజర్వాయర్లలోకి సహజసిద్ధంగా వచ్చే నీరు కూడా వివిధ ప్రాంతాల్లోని వ్యర్థ, మురుగునీటితో కలిసిపోయి వస్తోంది. ఫలితంగా రిజర్వాయర్లలోకి వచ్చే నీటి నాణ్యత కూడా దెబ్బతింటోంది.