సుందరమైన వనాలతో పాటు ఔషధ, పూల మొక్కలకు నెలవైన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి ప్రజల సందర్శన శుక్రవారం ముగియనుంది. జనవరి 2 నుంచి ప్రాంగణంలోకి సందర్శకులను అధికారులు అనుమతించారు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈసారి డిసెంబర్ 20 నుంచి 28 వరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇక్కడ బస చేశారు.
ఈసారి రెండు వారాలు..
బుధవారం వరకు మొత్తం 29వేల మందికి పైగా ఈ ప్రాంగణాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. గత ఏడాది వారం రోజుల పాటు మాత్రమే సందర్శకులను అనుమతించినప్పటికీ.. ఈ సారి రెండు వారాల పాటు అవకాశం కల్పించారు.