Former MP Rapolu Ananda Bhaskar: మునుగోడు ఉపఎన్నికల ముందు భాజపా నేతలకు మరో షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ప్రకటించారు. అరుణ్ జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్ నాలుగున భాజపాలో చేరానని.. ఇంతకాలం పార్టీలో కలిసి ఉండే అవకాశం కల్పించినందుకు ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. భాజపా వసుదైన కుటుంబ భావనకు పెద్ద పీట వేస్తుందనుకొన్నానని.. ఈ సూత్రానికి పార్టీ నిజంగా కట్టుబడి ఉందా అనే అనుమానాన్ని రాపోలు వ్యక్తం చేశారు.
దేశంలో ఇబ్బందికరమైన విచ్ఛిన్నకరమైన రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయని రాపోలు ఆరోపించారు. పార్టీని వీడే సమయంలో తప్పులు ఎత్తి చూపడం తన లక్షణం కాదని ఆయన పేర్కొన్నారు.. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటారనే భావిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారిందని ఆక్షేపించారు. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం కూడా ఎక్కువైందని అభిప్రాయపడ్డారు.