తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2021, 6:44 AM IST

ETV Bharat / state

ఇద్దరు కలెక్టర్లకు 3 నెలలు జైలు విధించిన హైకోర్టు

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌, అప్పటి జేసీ యాస్మిన్‌ బాషా, భూసేకరణ అధికారి ఎన్‌.శ్రీనివాసరావుపై హైకోర్టు చర్యలు తీసుకుంది. అనంతగిరి రిజర్వాయర్​ భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన కారణంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఇద్దరు కలెక్టర్లకు 3 నెలల జైలు విధించిన హైకోర్టు..
ఇద్దరు కలెక్టర్లకు 3 నెలల జైలు విధించిన హైకోర్టు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్‌ భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌, అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా (ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్‌), భూసేకరణ అధికారి ఎన్‌.శ్రీనివాసరావులకు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 11 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వి.ముత్తారెడ్డి, మరో 10 మంది రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు.

ఇదీ వివాదం

అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా 69.22 ఎకరాలు, 257.37 ఎకరాల భూసేకరణ నిమిత్తం 2017లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టలేదని, గ్రామసభలను నిర్వహించలేదని, అభ్యంతరాలను స్వీకరించలేదంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు పునరావాసం ప్యాకేజీ కల్పించేదాకా భూములను స్వాధీనం చేసుకోరాదని, వాటిని ముంపునకు గురి చేయరాదంటూ 2018 అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా భూములను 2019లో ముంపునకు గురి చేయడంతో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. చట్టప్రకారం పునరావాస అవార్డు ప్రకటించామని ప్రభుత్వం తెలిపింది.

కోర్టు ఏమి చెప్పిందంటే...

దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇళ్లకు చెందిన స్థలాల సేకరణకు పునరావాస పరిహారం చెల్లించారన్నారు. వ్యవసాయ భూములకు పునరావాస ప్యాకేజీ చెల్లించలేదన్నారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసినపుడు పునరావాస ప్యాకేజీ కూడా వేర్వేరుగా ఉండాలన్నారు. ఇందులో ప్రభుత్వం 500 పేజీలకు పైగా ఉన్న కౌంటరును దాఖలు చేస్తూ నిబంధనల ప్రకారం భూసేకరణ జరిగినట్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి భూమిని స్వాధీనం చేసుకోరాదంటూ ఈ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని, వాటిని ఎత్తివేయకుండా భూములను ముంపునకు గురి చేయడం కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను అనుమతిస్తూ ప్రతివాదులు ముగ్గురికీ మూడు నెలల సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అప్పీలు చేసుకోవడానికి వీలుగా ఆరువారాల పాటు ఈ తీర్పును నిలిపేశారు. అయితే వారి సర్వీసు రికార్డుల్లో దీనిని నమోదు చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:ఈ నెల మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details