తెలంగాణ

telangana

By

Published : Mar 17, 2023, 7:30 AM IST

ETV Bharat / state

రాష్ట్రంలో వడగళ్ల వర్షం.. కశ్మీర్​ను తలపించిన రోడ్లు.. తడిసిముద్దైన పంటలు

Rain with hail in Telangana : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా కురిసిన వడగడ్ల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వికారాబాద్​, సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటితో పాటు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. మరికొంత మందికి గాయాలయ్యాయి.

Hail rain in Vikarabad
వికారాబాద్​లో వడగడ్ల వర్షం

Rain with hail in Telangana : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ పడిన పిడుగులకు ముగ్గురు మృతి చెందగా వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది. వడగళ్ల వానకు పలుచోట్ల రోడ్లు, పొలాలు తెల్లటి మంచు స్ఫటికాలతో నిండి కశ్మీర్‌ను తలపించాయి. అనేక ప్రాంతాల్లో రేకుల ఇళ్లకు చిల్లులు పడటంతో పాటు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు, వడగళ్లు, ఆదివారం వర్ష కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

వర్షం పడడం వల్ల పంటలకు తీవ్ర నష్టం: హైదరాబాద్‌ నగరానికి నిత్యం కూరగాయలు సరఫరా చేసే సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని పంటలు దెబ్బతిని అన్నదాతలకు అపార నష్టం మిగిలింది. సంగారెడ్డి జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఉల్లి, 500 ఎకరాల్లో కూరగాయలు, 250 ఎకరాల్లో మామిడి, 50 ఎకరాల్లో బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో వడగళ్ల కారణంగా 10 మందికి పైగా విద్యార్థులు గాయాలపాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో మంచు రాయి 300 గ్రాముల నుంచి అరకిలో బరువు ఉండడంతో ఇళ్ల పైకప్పు రేకులు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వరి పంటలు, పుచ్చ, నిమ్మ, మిర్చి, బత్తాయి, నిమ్మ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

పిడుగులు పడడం వల్ల ముగ్గురు మృతి:వడగళ్ల వానతో పాటు గర్జించిన పిడుగులు ముగ్గురుని బలి తీసుకున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగసానిపల్లిలో గొర్రెల కాపరి బాలకృష్ణ, వనపర్తి మండలం చిట్యాలలో వంగూరు లక్ష్మి, జోగులాంబ గద్వాల జిల్లా ఆరగిద్దలో రైతు జమ్మన్న పిడుగుపాటుకు మృతి చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కాడెద్దు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

కొన్ని గంటల పాటు విద్యుత్​ సరఫరాకు అంతరాయం: హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మధ్యాహ్నానికి మబ్బులు కమ్మేయడంతో సూర్యాస్తమయం అయినట్లుగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో వరుణుడు విజృంభించాడు. ఎల్బీనగర్‌ కూడలి, మన్సూరాబాద్, వనస్థలిపురంలో రోడ్లు జలమయం అయ్యాయి. హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట్, కుంట్లూరు, పసుమాముల, తట్టిఅన్నారం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, అత్తాపూర్, ఉప్పరపల్లి తదితర ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details