తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2023, 9:15 AM IST

ETV Bharat / state

వేలల్లో బాధితులు.. రూ.వేల కోట్లలో మోసాలు.. గొలుసుకట్టు ఆట కట్టించలేరా..?

Q-net company scams: డబ్బు కట్టిన వారికి సభ్యత్వం ఇస్తారు. ఆ తరువాత స్టాలిన్​ సినిమా తరహాలో.. మరో ముగ్గురిని చేర్పించాలంటారు. ఎదరు తిరిగితే కేసుల పేరుతో భయపెడతారు. తమ చీకటి బాగోతం బయటపడకుండా కావాల్సినన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. చాప కింద నీరులా చుట్టేసిన క్యూనెట్​ తరహా దందాలు.. ఇటీవల జరిగిన స్వప్నలోక్​ ఘటనతో మరోసారి తెరపైకి వస్తున్నాయి.

Qnet company scams
Qnet company scams

Q-net company scams: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం భక్తులాపురానికి చెందిన గోపాల్‌దాస్‌ రాము ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఈ-కామర్స్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ బిజినెస్‌లో చేరాలని అతనితో పాటు చదివిన త్రివేణి ప్రతిపాదించారు. వారానికి రూ.50-60 వేలు సంపాదించే అవకాశముందని చెప్పడంతో రాము గత ఏడాది ఆగస్టులో రూ.1.5 లక్షలు కట్టి సభ్యత్వం తీసుకున్నారు. కట్టిన సొమ్ముకు క్యూనెట్‌ అనుబంధ సంస్థ పేరిట డిన్నర్‌సెట్‌ పంపించారు. దాని విలువ రూ.1 లక్షా 17 వేల 200గా ఉంటుందని చెప్పారు.

ఉద్యోగం కోసం రాము సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని కార్యాలయానికి వెళితే.. బంధువులకు, స్నేహితులకు కాల్స్‌ చేసి సంస్థలో చేర్పించే పని అప్పగించారు. కొత్తగా సభ్యుల్ని చేర్పిస్తేనే కమీషన్‌ వస్తుందని చెప్పడంతో అది గొలుసుకట్టు వ్యాపారమని రాము గ్రహించాడు. వెంటనే తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగాడు. గంజాయి కేసులో ఇరికిస్తాం.. నిర్భయ కేసు పెడతామంటూ రామును బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకున్నారు. దీంతో ఆయన గత డిసెంబరు 31న మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు స్పందించకపోవడంతో.. ఫిబ్రవరి 1న పెన్‌పహాడ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈలోగా క్యూనెట్​ సంస్థ కార్యాలయంలో గత నెల సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. అందులో త్రివేణి ఒకరు.

‘ముందు కొంత డబ్బు కట్టి సభ్యత్వం తీసుకో.. మరో ఇద్దరిని చేర్పించు.. కొత్తవారిని చేర్పిస్తూ ఉంటే కమీషన్‌ నుంచే జీతం వస్తుంది. లేదంటే కట్టిన డబ్బులు, జీతం రెండూ రావు..’ ఇదీ గొలుసుకట్టు వ్యాపారంలో మోసాలు. ఈ విధానంపై దేశంలో నిషేధం ఉండటంతో మోసగాళ్లు తమది గొలుసుకట్టు వ్యాపారం కాదని నేరుగానే ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నామని కట్టు కథలు అల్లి మాయ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికినా.. అసలైన యాజమానులు తప్పించుకుని మధ్యలో ఉండే ఏజెంట్లు మాత్రం అడ్డంగా బలైపోతున్నారు. తమ సంస్థలో తొలుత చేరిన వారు విధి లేని పరిస్థితుల్లో మోసాలకు పాల్పడేలా చేసి.. వారిని ఇరికించడమే గొలుసు కట్టు సంస్థల వ్యాపార కుయుక్తి.

తెలిసో తెలియకో వీటిలో చేరే సభ్యులు తమ డబ్బును కమీషన్‌ రూపంలో తిరిగి రాబట్టుకునేందుకు తమ బంధువులనో.. సన్నిహితులనో మాయ చేసి సభ్యులుగా చేర్పిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే కేసుల పేరిట భయపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం, సీఐడీ ఉదాసీనంగా వ్యవహరిస్తుండం గమనార్హం.

సైబరాబాద్‌ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ ఉన్నప్పుడు ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. మోసాలను బహిర్గతం చేసి పలువురిని జైలుకు పంపారు. సైబరాబాద్‌లో నేరాలను అరికట్టడానికి ప్రత్యేకంగా ‘ఆర్థిక నేరాల విభాగం' ఏర్పాటు చేశారు. ఆయన బదిలీపై ఆర్టీసీ ఎండీగా వెళ్లాక.. కేసుల దర్యాప్తు మందగించిందనే విమర్శలు వచ్చాయి. గత నెలలో స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద నేపథ్యంలో రూ.వేల కోట్లతో ముడిపడిన క్యూనెట్‌ బాగోతం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సంస్థ బాధితులు హైదరాబాద్​తో పాటు కరీంనగర్‌, సూర్యాపేట, నర్సంపేట ప్రాంతాల్లో ఉన్నారు.

ఇవీ చదవండి:

DATA చోరీ కేసు.. వినయ్‌ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం

మనసు మార్చుకున్న దొంగలు.. లూటీ చేసిన సొమ్ము.. వాకిట్లో ప్రత్యక్షం

ప్రేమ వివాహం ఎంత పని చేసింది.. విడదీశారని యువకుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details