President Drupadi Murmu Telangana Tour Ended : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పర్యటనలో చివరి రోజు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతికి.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో పాటు.. ఆలయ బాధ్యులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు.
యాదాద్రి ఆలయ అర్చకులు మంగళ వాద్యాలు, పూర్ణకుంభంతో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. గర్భాలయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అర్చకులు.. చతుర్వేద ఆశీర్వచనాలు అందించారు. యాదాద్రి ఆలయ క్షేత్రాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. అద్భుతమైన శిల్పకళను చూసి అచ్చెరువొందారు . కృష్ణ శిలతో మనోహరంగా తీర్చిదిద్దిన ఆలయ క్షేత్రాన్ని తిలకించిన ద్రౌపది ముర్ము అక్కడి శిల్పకళపై ప్రసంశలు కురిపించారు.