వేసవి వేడికి రోడ్లే కాదు వాహనాలు కూడా భగ్గుమంటున్నాయి. నడిరోడ్డు మీదే బుగ్గిపాలు అవుతున్నాయి. ఎండాకాలం వస్తుందంటే వాహనాలు.. ప్రత్యేకించి కార్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించటంతోపాటు ఇంజిన్ను చల్లబరిచే అన్ని రకాల ఉపశమనాలు పూర్తిస్థాయిలో ఉన్నాయో లేదో, టైర్లలో గాలి తగినంత ఉందో లేదో సరి చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్లు తగ్గిపోయినా వాహనం దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. గాలి తక్కువగా ఉన్నా, టైర్లు అరిగిపోయినా ఎండవేడిమికి వాహన వేగం తోడై టైర్లు పేలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎండాకాలం ప్రారంభంలోనే రాష్ట్రంలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉంది. గత నెల రోజుల్లోనే ఇంజిన్లోంచి మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమైన సంఘటనలు పది వరకు జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం వచ్చి అక్కడికి వెళ్లే లోపే వాహనాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయని అగ్ని ప్రమాదాల నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే అందులో ప్రయాణించేవారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చని వారంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే వాహనాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించటమే కాదు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అన్నీ సరిచూసుకోవాలి
'కారు ప్రయాణించేటప్పుడు ఇంజిన్లో 170 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. బయట 40 డిగ్రీలకు పైనే వేడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇంజిన్లో ఉండే లిక్విడ్ కూలెంట్, ఇంజిన్ ఆయిల్ త్వరగా ఆవిరి అయిపోతాయి. ముందు అద్దాన్ని శుభ్రం చేసే వైపర్ ఫ్లూయిడ్ను, ఏసీలో ఉండే క్లోరో ఫ్లోరో కార్బన్ స్థాయిలను తరచుగా తనిఖీ చేసుకోవాలి. ఆయా లిక్విడ్లు ఆవిరైతే ఇంజిన్ మరింతగా వేడెక్కుతుంది. ఇంజిన్లో ఉండే వైరింగ్, ప్లాస్టిక్ ఉపకరణాలు వేడికి కరిగిపోయే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇంజిన్లో ఆయిల్ లీక్ కావటం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. సైలెన్సర్ నుంచి వేడిమి బయటకు వస్తుంది. ఎక్కడైనా ఆయిల్ లీకైతే సైలెన్సర్ నుంచి కారుతుంటుంది. అది కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది.'