తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆపదలో ఆదుకుంటున్న తపాలా శాఖ - తపాలా శాఖ వార్తలు

లాక్‌డౌన్‌ వల్ల వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ప్రజా రవాణా సేవలు నిలిచిపోయాయి. బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తపాలాశాఖ అండగా నిలుస్తోంది. వైద్యవిభాగానికి చెందిన అత్యవసర ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లను మారుమూల ఆస్పత్రులకు చేరుస్తూ.. డాక్‌సదన్ అండగా నిలుస్తోంది.

post office huge service to people during corona pandemic time
ఆపదలో ఆదుకుంటున్న తపాలా శాఖ

By

Published : May 2, 2020, 5:40 PM IST

అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక తపాలా సేవలు దాదాపు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఊళ్లలో పోస్ట్‌మాన్‌ కోసం ఎదురు చూసేవాళ్లు.. ఏ సమాచారం రావాలన్నా... చేరవేయాలన్నా.. అతడే ఆధారం. రానురాను ఆ అవసరం పూర్తిగా తగ్గిపోయింది. పార్సిల్‌ సర్వీసుల విషయంలోనూ ప్రైవేట్ కొరియర్లు మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించారు. అయినా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తపాలా శాఖ ప్రయత్నించింది. ప్రభుత్వ పథకాల నగదు చెల్లింపులతోపాటు పల్లెల్లో బ్యాంకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం కరోనా సమయంలోనూ తపాలా శాఖ మన్ననలు అందుకుంటోంది. నిరంతరాయంగా సేవలందిస్తోంది.

ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లు

ప్రస్తుతం పలు రకాల పార్సిల్స్‌ రవాణాకు తపాలా శాఖే ఆధారమైంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు పార్సిళ్లు చేరవేస్తోంది. లేఖలు, మనీయార్డర్, స్పీడ్ పోస్టు, పార్సిల్ బుకింగ్ సేవలు యథాతథంగా నడుస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వైద్య సేవలకు సంబంధించిన సరంజామాను తపాలా శాఖ శరవేగంగా చేరవేస్తోంది. అంతర్​రాష్ట్ర, మెట్రో నగరాలు, మారుమాల ప్రాంతాల్లోని ఆస్పత్రులు, ఆరోగ్య ఉప కేంద్రాలకు ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లు, వైద్యసిబ్బందికి రక్షణ పరికరాలను సకాలంలో అందజేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర వైద్యసదుపాయాల మౌలికాభివృద్ధి సంస్థ 3 వేల 5 వందల టన్నుల విలువ చేసే ఔషధాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేయడానికి తపాలాశాఖనే ఎంచుకుంది.

రాములోరి ముత్యాల తలంబ్రాలు

మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్​వాడీ వర్కర్లు, ఆయాలకు మాస్కులు అందించడంలోనూ తపాలాశాఖ తోడ్పాటునందించింది. వ్యవసాయ రంగానికి సంబంధించి విత్తనాలు, పురుగల మందులు సైతం రవాణా చేస్తోంది. ప్రైవేట్ కొరియర్లతో పోలిస్తే మూడో వంతు మాత్రమే రుసుము వసూలు చేస్తూ రవాణా చేస్తున్న ఘనత తపాలాశాఖకే దక్కింది. భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని కరోనా వల్ల భక్తులు ప్రత్యక్షంగా వీక్షించలేకపోయినా.. ముత్యాల తలంబ్రాలను తపాలా శాఖ చేరవేసింది. 20వేల బుకింగ్‌లు రాగా నెల వ్యవధిలో 15వేల చిరునామాలకు చేరవేసింది. మామిడి రైతులను ఆదుకునేందుకు ఉద్యానవన శాఖతో ఒప్పందం కుదుర్చుకొని ఇంటికే సరఫరా చేస్తోంది. కరోనా వల్ల చాలా ప్రభుత్వ శాఖల్లో విధులకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గింది. కానీ, తపాలాశాఖలో మాత్రం 11వేల మంది ఉద్యోగుల్లో 9వేల మందికిపైగా హాజరవుతున్నారు.

ఇదీ చూడండి:-ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్​లో తగ్గిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details