తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడేళ్లనుంచి ఎదురు చూపులు... సొంతింటి కోసం పడిగాపులు

ఎన్నాళ్లు మురికికూపంలో బతుకుతారు.. అందమైన ఇంటితోపాటు అనేక సౌకార్యలు కల్పిస్తామంటూ అధికారులు నమ్మించారు. వారి మాటలు నమ్మి అనేక ఏళ్లుగా జీవనం సాగిస్తున్న ఇంటిని ఖాళీ చేసి.. అద్దె ఇళ్లలోకి మారారు. సర్కారు ఇచ్చే ఇంటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు గానీ... వారి ఆశలు ఫలించడంలేదు. హైదరాబాద్‌ మహానగరంలోని పదివేల కుటుంబాలు తాము ఉంటున్న మురికివాడలను ఖాళీ చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. మూడేళ్లయినా ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి కాకపోవడం వల్ల ఆ పేదలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

By

Published : Mar 7, 2021, 7:08 AM IST

poor-people-waiting-for-double-bedrooms
మూడేళ్లనుంచి ఎదురు చూపులు... సొంతింటి కోసం పడిగాపులు

రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మహానగరంలో పలు బస్తీల్లో కూడా ఈ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. రాజధానిలో 1,450 చోట్ల గుర్తించిన మురికివాడలుంటే ఇందులో చాలా వాటిలో డ్రైనేజీ, ఇతర కనీస సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో దశలవారీగా అక్కడి వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి ఆ స్థలంలో ఇళ్లను నిర్మించి ఇస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు. అనేకమంది బస్తీలను ఖాళీ చేయడానికి ససేమిరా అన్నారు. చివరికి 40 వాడల్లో నివాసముంటున్న వారు తమ ఇళ్లను ఖాళీ చేయడానికి అంగీకరించారు. ఈ నలభై చోట్ల పదివేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని మూడేళ్ల కిందటే మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 2వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. మరో వెయ్యి ఇళ్లను ఎన్నికల కోడ్‌ ఎత్తివేసిన తరువాత పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఏడువేల ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి.

నిధుల విడుదలేదీ..?

నగరంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల వరకు నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ కారణంగా చాలా చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు పట్టించుకుంటే సంబంధిత నియోజకవర్గంలో మాత్రం పనులు పూర్తవుతున్నాయి. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాన్ని చాలా వరకు పూర్తి చేయించడంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కృతకృత్యులయ్యారు. మురికివాడలను ఖాళీ చేసిన వారిలో కొందరు అద్దెలు భరించలేక రోడ్లపక్కనే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మరికొందరు తక్కువ అద్దెలున్న నివాసాల్లో ఉంటున్నారు. అద్దెలతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివాదాలు.. ఎదురుచూపులు

కొన్ని చోట్ల కోర్టు కేసులతో పనులు నిలిపివేశారు. గుడిమల్కాపూర్‌ దగ్గర భోజగుట్ట మురికివాడలో దాదాపు 1600 కుటుంబాలను ఖాళీ చేయించి ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. తీరా స్థలం విషయంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో వివాదంగా మారింది. దీంతో పనులు ఆపేశారు. తమకు ఏదో ఒక చోట స్థలాన్ని కేటాయిస్తే చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటామని లేని పక్షంలో తమ స్థలాన్నే తమకివ్వాలని అక్కడి పేదలు కోరుతున్నారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. జంగమ్మెట్‌, పిల్లిగుడిసెలు, ఇందిరానగర్‌, ఓల్డ్‌ మారేడుమిల్లి తదితర అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం

మురికివాడల్లో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ప్రత్యేక అధికారి సురేష్ తెలిపారు. ఇప్పటికే ఆరు మురికివాడల్లో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని వెల్లడించారు. మరో పదిచోట్ల త్వరలో పంపిణీ చేస్తామని... మిగిలిన చోట్ల కూడా నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయని... ఇప్పుడన్ని చోట్ల వేగంగా పనులు చేయడానికి ప్రణాళికను రూపొందించామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశముందన్న కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details