తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: బీ-ఫారాల భోగం ఎవరికి పట్టనుందో..! - మున్సిపోల్స్​

కొద్ది గంటల్లో మున్సిపల్‌ నామినేషన్ల ఉపసంహరణలకు గడువు ముగుస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీల బుజ్జగింపుల పర్వం మరింత జోరందుకుంది. ఒక్కరే బరిలో ఉండేలా..తిరుగుబాటుదారుల్ని కట్టడి చేసేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బుజ్జగింపులతో తమ దారిలోకి రాకపోతే వేటు వేయాలని పార్టీల నేతలు భావిస్తున్నారు. మొత్తంగా భోగి పండగ రోజే బీ-ఫారాల భోగం ఎవరికి పట్టనుందో తేలనుంది.

latest news on municipal elections in telangana
బుజ్జగింపులు

By

Published : Jan 14, 2020, 7:20 AM IST

Updated : Jan 14, 2020, 9:40 AM IST

బుజ్జగింపులు

అసంతృప్తులతో బేరసారాలు
రహస్య సమావేశాలు...బుజ్జగింపులు...నామినేటెడ్‌ పదవుల ఆశ. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తున్న పరిస్థితి ఇది. పురపాలికల్లోని పలు వార్డులు, డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉండటంతో రెబెల్స్‌ను తప్పించేందుకు నేతలు బుజ్జగింపుల జోరును పెంచారు. రంగంలోకి దిగిన పార్టీల ముఖ్యనేతలు... నామినేషన్లు వేసిన వారిని సముదాయిస్తున్నారు. అభ్యర్థులతో నేరుగా సంప్రదింపులు చేస్తూ రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అధికార పార్టీలో కో-ఆప్షన్, మార్కెట్‌ డైరెక్టర్లు, ఇతర నామినేటేడ్‌ పదవులతోపాటు పార్టీ పదవుల ఎర వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ ఎక్కువ మంది పోటీ లేకుండా చూడడానికి మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి బేరసారాలు సాగిస్తున్నారు.

కాంగ్రెస్​ అభ్యర్థుల మొండిపట్టు..నేతలకు తలనొప్పులు
అధికార తెరాస పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ అదే తరహాలో ఆశావహులు పోటీకి దిగారు. చాలాచోట్ల తెరాస, కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కో వార్డుల్లో సగటున ముగ్గురు, నలుగురు నామినేషన్‌లు వేశారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన వారిలో చాలామంది తమకంటే తమకే టికెట్‌ కావాలంటూ మొండి పట్టు పడుతుండటంతో పార్టీ ముఖ్యులకు తలనొప్పులు తప్పటం లేదు. ఎవరికి వారుగా అభ్యర్థులు ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అనేలా పార్టీని అభ్యర్థిస్తుండటంతో ఎవరికి టికెట్‌ని ఇవ్వాలనేది పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. అందుకే బలమైన అభ్యర్థిని బరిలో నిలుపుతూనే ఇతరుల్ని పోటీ నుంచి తప్పించేందుకు పార్టీ ముఖ్యులు నానాతంటాలు పడుతున్నారు. పోటీలో ఉన్న మిగతా వారిని నయానో భయానో ఇచ్చి ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చెబితే వారు వింటారోననే విషయమై ఆరా తీస్తూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇది ఫలిస్తున్నా మరికొన్నిచోట్ల వినేపరిస్థితి లేకపోవడంతో ఉపసంహరణ గడువు వరకు పంచాయితీ నడవనుంది.


బీ-ఫారాలపై వీడనున్న ఉత్కంఠ
నామినేషన్‌ దాఖలు చేసిన ఆశావహులు మాత్రం బీ-ఫారాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అనిశ్చితిలో...ఎవరూ ప్రచారం చేయలేకపోతున్నారు. కాలనీల్లో విందులు, ఇతర ఖర్చులకు సైతం వెనుకాడుతున్నారు. తాము ఖర్చుచేస్తే మరొకరికి టికెట్టు వస్తే పరిస్థితి ఏంటనే బెంగతోనే అందరు నిస్తేజంలో ఉన్నారు. కీలక నేతల ఆశీర్వాదం కోసం ప్రయత్నిస్తున్నారు. నేతలకు దగ్గరగా ఉన్నవారితో ఒత్తిడి తెస్తున్నారు.కానీ, అన్నిపార్టీలు అభ్యర్థుల ఖరారును రహస్యంగా ఉంచుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువుకు గంట ముందే వీటిని నేరుగా అధికారులకు అందించాలని భావిస్తున్నారు. అభ్యర్థులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారే దూకుడును అడ్డుకునేందుకే ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు వేసిన వారిలో కొందరు స్థానికంగా పట్టున్నవారు కావడం.. ఎన్నికల్లో సొంత బలంతో గెలిచే పరిస్థితి ఉండటంతో అలాంటి వారి విషయమై అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. మొత్తంగా బల్దియా ఎన్నికల్లో ఉపసంహరణల ముగింపు రోజే బీ-ఫారాలపై ఉత్కంఠ వీడనుంది. మంగళవారం భోగి పండగ రోజే అన్ని పార్టీలు బీ-ఫారాలు అందించనున్నాయి. పార్టీ టికెట్లు వచ్చిన అభ్యర్థుల్లో సంక్రాంతి కొత్త కాంతి నింపనుండగా...మరుసటి రోజు మకర సంక్రాంతి నుంచే ప్రచార హడావుడి అన్ని వార్డుల్లో జోరందుకోనుంది.


అధిష్టానం సూచనలతో కొందరు అభ్యర్థులు...ప్రచారం మొదలుపెట్టగా... మరికొందరు ఆశావహులు మాత్రం సందిగ్ధంలో ఉన్నారు. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవటంతో... జాబితాలో పేరు ఉంటుందా? టికెట్‌ వస్తుందా.. రాకుంటే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. మొత్తంగా ఎత్తుకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పుర రాజకీయంలో రేపే ఉత్కంఠ వీడనుంది.

ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!

Last Updated : Jan 14, 2020, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details