ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరుకు చెందిన యువతి సోని అపహరణకు గురై వారం రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించడం లేదు. నిందితుడు రవిశేఖర్ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కర్నూలు, కడప జిల్లాల్లో నిందితుడు కారులో సంచరించాడన్న సమాచారంతో స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపడుతున్నారు. రవిశేఖర్ యువతిని ఎక్కడికి తీసుకెళ్లాడనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు.
లక్ష రూపాయల నజరానా
నిందితుని ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు ఇప్పటికే లక్ష రూపాయల నజరానా ప్రకటించారు. నిందితుడు రవిశేఖర్పై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 23న ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సోనీ అనే బీ ఫార్మసీ విద్యార్థినిని రవిశేఖర్ అనే నిందితుడు కారులో అపహరించుకుపోయాడు. హైదరాబాద్లో యువతిని అపహరించడానికి రెండు రోజుల ముందు తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోనూ ఇద్దరు మహిళలను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చూడండి : 'పారిక్ కేసులో కిడ్నాపర్లను త్వరలోనే పట్టుకుంటాం'