తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2023, 1:50 PM IST

ETV Bharat / state

సాత్విక్ చనిపోవడానికి అదే కారణం.. రిమాండ్​ రిపోర్టులో కీలక అంశాలు

Police Remand Report in Sathvik Suicide Case: కళాశాలలో వేధింపుల కారణంగానే ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రిన్సిపల్‌, ఇతర సిబ్బంది దుర్భాషలాడటం, చితకబాదినట్లు వివరించారు. ఇలాంటి పరిస్థితులతోనే విద్యార్థి మానసికంగా కుంగిపోయి.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Satvik suicide case
Satvik suicide case

Police Remand Report in Sathvik Suicide Case: ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. కళాశాల వేధింపుల వల్లే విద్యార్థి చనిపోయాడని తెలిపారు. సాత్విక్‌ను అసభ్యకరంగా తిట్టడం వల్లే మనస్తాపం చెందాడని వివరించారు. తోటి విద్యార్థుల ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్లు వివరించారు. శ్రీ చైతన్య కళాశాల అడ్మిన్‌ ప్రిన్సిపల్‌ నర్సింహాచారి అలియాస్‌ ఆచారి, కృష్ణారెడ్డి రోజూ స్వాతిక్​ను తిట్టడంతో మానసికంగా కుంగిపోయాడని పోలీసులు చెప్పారు.

సాత్విక్​ చనిపోయే రోజు తల్లిదండ్రులు వచ్చి వెళ్లగానే.. సాత్విక్​ను ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి చితకబాదినట్లు పోలీసులు వెల్లడించారు. ఆచారి, కృష్ణారెడ్డి సాత్విక్​ ఇంట్లో వారిని బూతులు తిట్టారని వివరించారు. మరోవైపు హాస్టల్‌లో సాత్విక్​ను వార్డెన్ వేధింపులకు గురి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే:సాత్విక్​నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే కళాశాల యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనై మార్చి 1న కళాశాలలోని తరగతి గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాజమాన్యం సరైన సమయంలో స్పందించి ఉంటే సాత్విక్​ బతికేవాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఎప్పుడూ మార్కుల గురించి సాత్విక్​ను మానసికంగా చిత్రహింసలు చేసేవారని.. సాత్విక్ తమకు చెప్పేవాడని తోటి విద్యార్థులు వివరించారు.

సాత్విక్​ రాసిన సూసైడ్ నోట్​: ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే సాత్విక్​ రాసిన సూసైడ్ నోట్​ను పోలీసులు గుర్తించారు. తన మరణానికి కారణం ఆ నలుగురే అని ఉంది. వారు కళాశాల అడ్మిన్​ ప్రిన్సిపల్​ అకలంకం నర్సింహాచారి, ప్రిన్సిపల్​ తియ్యగురు శివ రామకృష్ణారెడ్డి, హాస్టల్​ వార్డెన్​ కందరబోయిన నరేశ్​, వైస్​ ప్రిన్సిపల్​ ఒంటెల శోభన్​బాబులే కారణమని అందులో ప్రస్తావించాడు. వారు తనను మానసికంగా, కొట్టి చిత్రహింసలు చేసేవారని పేర్కొన్నాడు. ఆ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం ఆయన ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు.

తనకు అడ్మిషన్​​ లేదు: ఈ క్రమంలోనే మరో అంశం వెలుగులోకి వచ్చింది. తన రిపోర్టులో ఇంటర్ బోర్డు ఎంక్వైరీ కమిటీ పలు కీలక విషయాలను ప్రస్తావించింది. సాత్విక్​ ఆత్మహత్య చేసుకున్న కళాశాలలో తనకు అడ్మిషన్​​ లేదని అందులో తెలిపింది. కళాశాలలో అడ్మిషన్​ జరిగినప్పుడు నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలతోనే రశీదు తమకు ఇచ్చారని సాత్విక్​ తల్లిదండ్రులు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details