తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫెంటానిల్ ఇంజెక్షన్‌ను బానిసైన వ్యక్తి - విక్రయిస్తున్న డాక్టర్​ దంపతుల గుట్టురట్టు ​ - Police arrest For using fentanyl

Police arrested Doctor Wife for Supplying Fentanyl Injection :హెరాయిన్, మార్ఫీన్‌ కంటే వందరెట్లు ఎక్కువ మత్తు కలిగించే ఫెంటనిల్‌ ఇంజెక్షన్లను అడ్డదారిలో విక్రయిస్తున్న డాక్టర్‌ దంపతుల గుట్టును టీఎస్‌ న్యాబ్, రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. రోగులకు శస్త్ర చికిత్సల సందర్భంగా నొప్పి, స్పృహ లేకుండా మత్తు కోసం ఇచ్చే ఫెంటనిల్‌ ఇంజెక్షన్లను డ్రగ్స్‌కు బానిసైన వారికి అమ్మేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్​నగర్​లోని సమీర్‌ ఆసుపత్రిలో మత్తు వైద్యుడుగా పనిచేస్తున్న డాక్టర్‌ హసన్‌ ముస్తఫాఖాన్, ఆయన భార్య లుబ్నా నజీబ్‌ ఖాన్‌ డబ్బు కోసం ఈ చీకటి దందా చేస్తున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు బాధితుడు సహా వైద్యుడి భార్యను అరెస్ట్ చేశారు.

Police arrested Doctor Wife for Supplying Fentanyl Injection
ఫెంటానిల్ ఇంజెక్షన్‌ను విక్రయిస్తున్న డాక్టర్​ దంపతుల గుట్టురట్టు - వైద్యుడి భార్యతో సహా మరో వ్యక్తి అరెస్ట్​

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 9:26 PM IST

Police arrested Doctor Wife for Supplying Fentanyl Injection : హైదరాబాద్‌లోని అసిఫ్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ హసన్‌ ముస్తఫాఖాన్‌ స్థానిక సమీర్‌ ఆసుపత్రిలో అనస్థీషియన్​గా పనిచేస్తున్నాడు. హసన్‌ తాను పనిచేసే ఆసుపత్రికి అనుబంధంగా పనిచేసే మందుల దుకాణం నుంచి ఫెంటనిల్‌ ఇంజెక్షన్లను తరచూ తీసుకెళ్తున్నాడు. శస్త్ర చికిత్సల సందర్భంగా పేషెంట్లకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఫెంటనిల్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్ని గసగసల ద్వారా తయారుచేస్తారు. మెదడు మొద్దుబారేలా చేసి విపరీతమైన మత్తుతో నొప్పి తెలియదు.

నిషేధిత డ్రగ్స్‌ అయిన హెరాయిన్‌ కంటే 50 రెట్లు, మార్ఫీన్‌ కంటే 100 రెట్లు ఎక్కువ మత్తు కలుగుతుంది. ఈ ఇంజెక్షన్లు విక్రయించాలంటే ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి ఇంజెక్షన్లను వైద్యుడు ముస్తఫా ఎలాంటి అనుమతి లేకుండా తరచూ తీసుకెళ్తున్నట్లు టీఎస్‌ న్యాబ్‌కు సమాచారం అందింది. దీంతో టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం దాదాపు నెల రోజులపాటు వైద్యుడి ఇంటిపై నిఘా ఉంచింది.

Police arrested a Man for using Fentanyl Injection : ఈ నిఘా సమయంలో అసిఫ్‌నగర్‌లోని వైద్యుడి నివాసానికి ప్రతీరోజు పోర్టర్ అనే యాప్ ద్వారా సామాగ్రి, వస్తువులు రవాణా చేసే సంస్థ డ్రైవర్లు రావడం, వారు ఒక పార్సిల్‌ తీసుకుని రాజేంద్రనగర్‌ పరిధిలోని ఒకరికి ఇస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా భావించిన టీఎస్‌ న్యాబ్‌ బృందం రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసుల సహకారంతో ఆపరేషన్‌ చేపట్టారు. ఇదే సమయంలో వైద్యుడు హసన్‌ కువైట్‌ వెళ్లినట్లు గుర్తించి, అతడు తిరిగి వచ్చే వరకూ ఆగాలని భావించారు.

కాగా డాక్టర్‌ హసన్‌ ముస్తఫాఖాన్‌ లేకున్నా ఆయన భార్య లుబ్నా నజీబ్‌ ఖాన్‌ ఫెంటనిల్‌ ఇంజెక్షన్లను పోర్టర్‌ ద్వారా రాజేంద్రనగర్‌కు చేరవేస్తోంది. వీటిని కొనుగోలు చేసి నిత్యం వాడే వ్యక్తి ఆరోగ్యం క్షీణిస్తోందని భావించిన పోలీసులు బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్‌లో మాటువేశారు. పోర్టర్‌ డ్రైవర్‌ నుంచి 4 వయల్స్‌ కొనుగోలు చేస్తున్న సమయంలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారిని తీసుకుని అసిఫ్‌నగర్‌లోని హసన్‌ నివాసంలో తనిఖీలు చేయగా 53 ఫెంటనిల్‌ వయల్స్‌ అనుమతి లేకుండా నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో వైద్యుడి భార్య లుబ్నా నజీబ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోదాల్లో పట్టుబడ్డ రూ.6.08 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కువైట్‌లో ఉన్న వైద్యుడిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హసన్‌ పనిచేసే సమీర్‌ ఆసుపత్రిలో డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం ద్వారా తనిఖీలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

వైఎస్సార్సీపీ నేత కుమారుడి రేవ్ పార్టీలో డ్రగ్స్ - ఎస్ఆర్ నగర్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు

రాష్ట్రంలో మరో 2 డ్రగ్స్ గ్యాంగుల పట్టివేత, అరెస్టైన వారిలో 21 ఏళ్ల యువతి

ABOUT THE AUTHOR

...view details