తెలంగాణ

telangana

ETV Bharat / state

petrol diesel price: పెట్రో మంట... బయటికి వెళ్లాలంటేనే వణుకంట! - తెలంగాణలో గత ఆరునెలల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు

పెట్రోల్, డీజిల్ (petrol diesel price) ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవ్వరికి వారు ఇష్టానుసారంగా పన్నుల పేరుతో దండుకుంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఇందన ధర వాహనదారులకు పెనుభారంగా మారుతోంది. ఈ ప్రభావం రవాణాపై పడి నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్ర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కట్టడిలేని ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.

petrol and diesel price increase
petrol and diesel price increase

By

Published : Jul 11, 2021, 7:44 PM IST

Updated : Jul 11, 2021, 9:22 PM IST

పెట్రోల్​, డీజిల్​ ధరలు (petrol diesel price) రోజురోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజువారీ ధరల నిర్ణయం ముసుగులో ధరల పెంపునకు చమురు సంస్థలు తెర తీశాయి. చమురు ధరల పెరుగుదలతో పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అడ్డూ అదుపు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు.

సుంకాల పేరుతో పిండేస్తున్నారు

ముడి చమురు బ్యారెల్‌ ధర ఆదివారం దాదాపు 75 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ రూ.74.49గా ఉంది. ఈ విలువలను పరిగణనలోకి తీసుకుంటే... బ్యారెల్‌ ముడి చమురు ధర రూ.5,587గా ఉంది. అంటే లీటర్ ముడి చమురు ధర రూ.35.14. లీటరు ముడి చమురును పెట్రోల్‌గా ప్రాసెసింగ్‌ చేసేందుకు, రీఫైనరీ మార్జిన్లు, ఫ్రైట్‌ ఖర్చులు, లాజిస్టిక్స్‌, ఓఎంసీ మార్జిన్‌లు అన్ని కలిపి లీటరుపై రూ.3.60లు, డీజిల్‌గా ప్రాసెసింగ్‌ చేసేందుకు, రూ.6.10లుగా ఉంది. అంటే ప్రాసెసింగ్‌ తరువాత ఒక లీటరు పెట్రోల్‌ ధర రూ.38.74లు, డీజిల్‌ ధర రూ.41.24లుగా ఉంది. ఈ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాల పేరుతో దోచేస్తున్నాయి. వ్యాట్​, ఎక్సైజ్​ సుంకం పేరుతో నిలువు దోపిడి చేస్తున్నాయి. ఎక్సైజ్‌ సుంకం పేరుతో కేంద్రం... ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.32.90లు, డీజిల్‌పై రూ.31.80లు విధిస్తోంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27శాతం చొప్పున వ్యాట్‌ విధిస్తోంది.

నొప్పి తెలియకుండా నడ్డి విరుస్తున్నారు...

రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.104.86, డీజిల్‌ రూ.97.96కు ఎగబాకింది. అంటే కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు లీటరు పెట్రోల్‌పై రూ.62.33లు, లీటరు డీజిల్‌పై 54.13లు పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో... మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మాత్రమే పెట్రోల్‌పై 80పైసలు, డీజిల్‌పై 75పైసలు తగ్గింది. మొత్తానికి ఈ ఆరు నెలల్లో పెట్రోల్‌పై రూ.17.80, డీజిల్‌పై రూ.17.36 పెరిగింది. ధరల పెంపు 15 రోజులుకో నెలకో... ఒకేసారి మూడు, నాలుగు రూపాయిలు పెంచినట్లయితే ఆ భారం వాహనదారులకు స్పష్టం తెలిసేది.. కాని రోజువారీ ధరల నిర్ణయం మాటున... రోజు విడిచి రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు పెంచుతూ పోతున్నాయి. ఈ ప్రభావంతో సామాన్యుడు వ్యక్తిగత వాహనాలను కూడా బయటకు తీయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

భారమైపోతున్న బతుకు

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో ఆ ప్రభావం అన్ని రకాల వస్తువులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతోంది. గతంలో ఉన్న ఆటో ఛార్జీలు, క్యాబ్‌ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. అదే విధంగా రవాణా ఛార్జీలు పెరుగుదలతో కాయగూరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఇతరత్ర వస్తులపై కూడా ఆ ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్‌ ధరలు పెరగడం వల్ల వారి రాబడిని పెంచుకుంటూనే పోతున్నాయే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశాలు లేవని చమురు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

గత ఆరు నెలల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరిశీలిస్తే..

నెల పెట్రోలు రూ.లలో డీజిల్ రూ.లలో
జనవరి 2.71 2.86
ఫిబ్రవరి 5.02 5.40
మార్చి (తగ్గింపు) 0.63 0.60
ఏప్రిల్​ (తగ్గింపు) 0.17 0.15
మే 3.94 4.78
జూన్​ 4.76 4.37
జులై (ఇప్పటి వరకు) 2.17 0.76

గణాంకాల ప్రకారం ఈ ఆరు నెలల్లో పెట్రోలు రూ. 17.80, డీజిల్​ రూ. 17.36 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.104.86, డీజిల్‌ ధర రూ. రూ.97.96 లుకు చేరింది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు అయ్యే వ్యయం ఆధారంగా రోజువారీ విక్రయాల ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:జీవ ఇంధనంపై కేంద్రం దృష్టి- ఆహార భద్రతకు ముప్పుందా?

Last Updated : Jul 11, 2021, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details