లాక్డౌన్తో ఎక్కడికక్కడ ఆగిపోయిన నగర జీవనం.. ఇటీవల ఇచ్చిన సడలింపులతో మళ్లీ మొదలైంది. కొన్ని మినహాయింపులు మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి. కానీ కీలక రవాణా వ్యవస్థలు ఆర్టీసీ, మెట్రోలాంటివి ఇంకా మొదలవక పోవడంతో గమ్యం చేరే దారిలేదు. కార్యాలయాలకు, పనికి వెళ్లేందుకు రోజూ ప్రయాస తప్పట్లేదు. ఈ సమయంలో అద్దె వాహనాల అంకుర సంస్థలు నగరవాసికి తిప్పలు తప్పిస్తున్నాయి. గతేడాది చివర్లో అడుగుపెట్టి ఆదరణ పొందిన బౌన్స్, వెగో లాంటి సంస్థలు నగరవ్యాప్తంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాయి. ప్రముఖ అద్దె వాహనాల అంకుర సంస్థ ‘బౌన్స్ ఆత్మనిర్భర్’ పేరిట కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. బెంగళూరు, హైదరాబాద్లలో దీర్ఘకాలిక అద్దె వాహనాల్ని అందించనున్నట్లు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి అంకిత్ ఆచార్య ‘ఈనాడు’కు తెలిపారు.
నగరంలో కీలకంగా..
ప్రజారవాణా అందుబాటులో లేకపోవడంతో ఈ అద్దెవాహనాల వైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. బౌన్స్ అంకుర సంస్థకు చెందిన 3 వేల అద్దె ద్విచక్ర వాహనాలు నగరవ్యాప్తంగా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో రోజూ ఇప్పుడు 5-6 వేల రైడ్లు తిరుగుతున్నాయి. లాక్డౌన్కి ముందు ఈ సంఖ్య 1500 నుంచి 2 వేల వరకు మాత్రమే. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నిర్వహణపరంగా జాగ్రత్తలు చేపట్టింది ఆ సంస్థ. ఎప్పటికప్పుడు వాహనాల్ని క్రిమి సంహారక ద్రావణంతో శుభ్రం చేయిస్తోంది.