తెలంగాణ

telangana

Revanth Reddy: '72 సీట్లు గెలుస్తాం... కచ్చితంగా అధికారంలోకి వస్తాం'

By

Published : Aug 19, 2021, 4:09 PM IST

వచ్చే నెలలో రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17న వరంగల్​లో కాంగ్రెస్ నిర్వహించదలిచిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ సభను భారీగా నిర్వహించాలని హస్తం శ్రేణులు భావిస్తున్నారు.

Slug
రాహుల్‌గాంధీ

రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (Pcc Chief Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తనకున్న రాజకీయ అవగాహన ప్రకారంగా కాంగ్రెస్‌ కచ్చితంగా 72 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇందిరాభవన్‌లో నియోజవర్గ పార్టీ సమన్వయ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్యకర్తలు కూడా గట్టిగా పనిచేస్తున్నారని కితాబుచ్చారు. అలాగే నాయకులు కూడా గట్టిగా కొట్లాడాలన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఆపేసి... కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పేరుతో పథకాన్ని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని అమలు చేస్తున్నారని... వీటన్నింటిపై ప్రధాన ప్రతిపక్షంగా మనమంతా నిలదీయాలని సూచించారు.

రూ. 10 లక్షలు ఇస్తాడా?

ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తారని తర్వాత ఎగ్గొడతారని తెలిపారు. హైదరాబాద్‌లో రూ. 10వేలు ఇవ్వలేని కేసీఆర్... రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత గిరిజన కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించాలన్నారు. అందుకోసమే ఆగస్టు 9న క్విట్‌ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్‌ 17వరకు 40 రోజులపాటు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.

వారిని గుర్తిస్తాం...

బాగా పనిచేసిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వారి పనితీరుతోనే పార్టీ బాగుపడుతుందన్నారు. ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజకవర్గంలో వారి పనితీరుపైన నివేదిక ఇవ్వాలని సూచించారు. పార్టీ నిర్మాణం ప్రజాసమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులకు సమన్వయకర్తలు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని తెలిపారు.

రాష్ట్రానికి రాహుల్...

వచ్చే నెలలో రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటిస్తారని (Rahul Gandhi Tour) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ (Manikkam Tagor) స్పష్టం చేశారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు ఆయన హాజరుకానున్నారు. వచ్చే నెల 17న వరంగల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ సభను భారీగా నిర్వహించాలని భావిస్తోంది.

యువజన, ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌ఛార్జులు, ఎస్సీ, ఎస్టీ విభాగాల ఇన్‌ఛార్జులను నియమించాలని మాణికం ఠాగూర్ సూచించారు. ఇంద్రవెల్లి, రావిర్యాల సభలను విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలోపేతమైందన్నారు.

నియోజకవర్గ సమన్వయకర్తలు బాగా పని చేస్తున్నారని మాణికం ఠాగూర్ అన్నారు. పార్టీ నిర్మాణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దన్నారు. బూత్ కమిటీ.. బూత్ లెవెల్ ఏజెంట్ల నిర్మాణం చేపట్టాలన్న ఆయన తెరాస ప్రభుత్వ అవినీతిపై నిరంతర పోరాటం చేయాలని పేర్కొన్నారు. మోదీ, కేసీఆర్ హామీలపై ప్రజల్లో బాగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో కూడా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:Revanth: కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తలకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details