ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఆర్ఐఎన్ఎల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గబోతున్నాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కనిపించబోతుంది. ఈ సంస్థ నుంచి ప్రస్తుతం రోజూ 170 టన్నులు వస్తుండగా.. రానున్న రోజుల్లో 100 టన్నులే రాబోతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఆర్ఐఎన్ఎల్లో ఉన్న నిల్వలు తరిగిపోయినందున ప్రస్తుతం ఏరోజుకారోజు తయారయ్యే ఆక్సిజన్ మాత్రమే కేంద్రం కేటాయించిన మేరకు వస్తోంది. అయితే.. ఇది కూడా 70 టన్నుల మేర తగ్గుతుందని సమాచారం వచ్చినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి అయితే అవసరం ఉన్నచోటుకు త్వరగా ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇప్పుడు తగ్గే 70 టన్నుల ఆక్సిజన్ ఎక్కడినుంచి పొందాలి..? అందుకు కేంద్రాన్ని ఎలా ఒప్పించాలన్న విషయమై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
ఒడిశాపై పొరుగు రాష్ట్రాల ప్రభావం..
ఒడిశాలోని అంగుల్, రవూర్కెలా నుంచి కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలూ రైలుమార్గం ద్వారా ఆక్సిజన్ తెప్పించుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల డిమాండు పెరిగి, రాష్ట్రానికి కేటాయించిన కోటా (127 టన్నులు) పొందేందుకు ఎక్కువ సమయం పడుతోంది. మిగిలిన రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ రావడం ఆలస్యం అవుతోంది. వాతావరణం అనుకూలించనందున ఆకాశమార్గంలో పంపడం ఒకోసారి కుదరట్లేదు. అన్నిచోట్ల నుంచి 80 ట్యాంకర్లు, 11 చిన్న ట్యాంకుల ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. దుర్గాపుర్, జంషెడ్పుర్, జామ్నగర్ నుంచి 180 టన్నుల సరఫరా జరుగుతోంది.
రోజుకు 800 టన్నుల అవసరం..
కేంద్రం కేటాయించిన సంస్థల నుంచి రాష్ట్రానికి ఈ నెల 8న 590 టన్నుల ఆక్సిజన్ వచ్చింది. 16 నాటికి ఇది 609.5 టన్నులకు చేరింది. ఇకపై కనీసం రోజుకు 800 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని అంచనా. రాష్ట్రంలో ప్రస్తుతం 635 టన్నుల ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది.