Own Vehicles Increased: సాధారణంగా నగరాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజారవాణాపై దృష్టిసారించాలి. విశ్వనగరంగా అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్లో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గత పదేళ్లలో నగర విస్తరణకు అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ధి చెందకపోవడం వల్లే ప్రజలు సొంత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో ప్రజారవాణా గణనీయంగా అభివృద్ధిచెందితే హైదరాబాద్లో మాత్రం తగ్గుముఖం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ తగ్గిపోవడం వల్ల ప్రజలు సొంతవాహనాల వైపు మళ్లుతున్నారని చెబుతున్నారు. వాటికి తోడు. కొవిడ్ విసిరిన సవాళ్లతో ... చాలామంది సొంతవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్లో ఇలా...గ్రేటర్లో ఏటా సుమారు 2 లక్షలకుపైగా కొత్తవాహనాలు రోడ్డెక్కుతున్నాయి. హైదరాబాద్లో 2020లో 65 లక్షల వాహనాలుంటే.. ప్రస్తుతం 70 లక్షలు దాటిపోయాయి. రవాణా శాఖ గణాంకాల ప్రకారం 70 లక్షల్లో సుమారు 45 లక్షలవరకు ద్విచక్రవాహనాలుండగా.... మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. ప్రజారవాణా మెరుగుపడకపోవడం సహా వివిధ కారణాలతో సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.
''ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. ఆటోవాళ్లు కూడా తాగుతారు. సరిగ్గా ఉండరు. పోనీ బుక్ చేసుకుందాం అంటే వాళ్లు ఎలాంటి వారో తెలియదు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావ్ అంటే లోకేషన్ ప్రకారం పోతున్నా అంటారు. అందుకే మేం సొంత వాహనం కొన్నాం.'' -సొంత వాహనదారుడు