హైదరాబాద్ కార్వాన్లో నివాసం ఉంటున్న సురేందర్ గౌడ్ రాణిగంజ్-2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సమ్మెలో పాల్గొన్న సురేందర్ ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగం పోయిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి విపక్షాల నేతలు నివాళులు అర్పించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికులు భారీగా వచ్చి చేరుతుండటం వల్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం సురేందర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
తాము న్యాయ పరంగా సమ్మె చేస్తున్నామని... ప్రభుత్వమే తమ మీద కక్ష కట్టిందని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇక్కడ ఎందుకు సాధ్యం కాదంటూ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మె చేయడం తమ హక్కని... చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలి కానీ ఇలా కార్మికులను మానసికంగా వేధించడం సబబు కాదని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని... తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మరువలేనిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అలాంటి కార్మికులను కేసీఆర్ విస్మరించి నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మృతుని కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, వాళ్ల పిల్లలకు ఉద్యోగాలు, ఓ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.