తెలంగాణ

telangana

'కరోనా మృతుల దహనాలకు ఉచితంగా వెయ్యి టన్నుల కలప'

By

Published : May 4, 2021, 5:11 PM IST

కొవిడ్​ మృతుల దహనానికి కట్టెల కొరతను తీర్చేందుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని శ్మశాన వాటికలకు కలపను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. ఈ విపత్తు సమయంలో తమవంతుగా రూ.20 లక్షల విలువ చేసే సుమారు వెయ్యి టన్నుల కట్టెలను అందించాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ ఛైర్మన్​ వంటేరు ప్రతాప్​రెడ్డి వెల్లడించారు.

శ్మశాన వాటికలకు ఉచితంగా కలప
శ్మశాన వాటికలకు ఉచితంగా కలప

కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీర్చాలని, చేయూత అందించాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం శ్మశానాలకు సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా అందించనుంది. కరోనా విపత్తు నేపథ్యంలో తమవంతుగా మానవతా దృక్పథంతో సాయం అందించాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి తెలిపారు.

పేపర్ మిల్లులకు అమ్మగా.. సంస్థ వద్ద మిగిలిన దాదాపు వెయ్యి టన్నుల కలపను హైదరాబాద్​తో సహా సమీప మున్సిపాలిటీల శ్మశానాలకు మృతదేహాలను కాల్చేందుకు సరఫరా చేయనున్నట్లు వంటేరు పేర్కొన్నారు. పెరిగిన కలప ధరలు పేదలకు భారంగా పరిణమించిన నేపథ్యంలో మానవతా దృక్పథంతో రూ.20 లక్షల విలువైన కలపను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.

వెదురునూ సరఫరా చేస్తాం..

జీహెచ్ఎంసీ, మిగతా పట్టణాల్లో స్థానిక పురపాలక అధికారులతో సమన్వయం చేసుకొని కలప అందించే ఏర్పాట్లు చేస్తామని సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. రంగారెడ్డి డివిజన్​లో 3,500 టన్నులు, ఖమ్మం-సత్తుపల్లి-అశ్వారావుపేట-భద్రాచలం డివిజన్​లలో 4,000 టన్నులు, మంచిర్యాల-కాగజ్​నగర్​లలో 860 టన్నులు, వరంగల్ డివిజన్​లో 200 టన్నుల కలప అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అంత్యక్రియలకు అవసరమైన వెదురును కూడా సరఫరా చేస్తామని చెప్పారు.

మున్సిపల్ అధికారులను సంప్రదించాలి..

హైదరాబాద్ పరిధిలో అంబర్​పేట, బన్సీలాల్​పేట, ఆసిఫ్​నగర్, ఈ.ఎస్.ఐ శ్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామని చంద్రశేఖరరెడ్డి అన్నారు. తమ వారి అంత్యక్రియలకు అవసరమైన కలప లభ్యత లేని పేదలు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. కలపను తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్లు ముందుకు వచ్చినట్లు ఆయన వివరించారు.

ఇదీ చూడండి:ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కావట్లేదు: కొప్పుల

ABOUT THE AUTHOR

...view details