తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2022, 8:20 AM IST

ETV Bharat / state

'మత్తు చిందులు'.. డిప్రెషన్‌, నొప్పి, దగ్గు ఔషధాల విచ్చలవిడి విక్రయాలు

Sales of drugs in Telangana state : రాష్ట్రంలోని చాలా ఔషధ దుకాణాల్లో చీటీలు లేకుండానే మాత్రల విక్రయాలు జరుగుతున్నాయి. డిప్రెషన్‌, నొప్పి, దగ్గు ఔషధాలు వైద్యుడి చీటీ ఉంటేనే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విచ్చలవిడిగా వీటిని అమ్మేస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో 200కి పైగా దుకాణాల్లో నిబంధనలను పాటించడంలేదని అధికారులు గుర్తించారు. టిని సత్వరమే మూసివేయించామని, దుకాణదారులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

Sales of drugs in Telangana state
డిప్రెషన్‌, నొప్పి, దగ్గు ఔషధాల విచ్చలవిడి విక్రయాలు

పంజాగుట్ట సమీపంలోని ఒక ఔషధ దుకాణంలో వైద్యుల చీటీలు లేకుండానే కోరినన్ని నొప్పి నివారణ మాత్రలు విక్రయించారు. ఖైరతాబాద్‌లోని మరో షాపులో దగ్గు ద్రావణాన్ని, ఇంకో చోట నిద్రమాత్రలు యథేచ్ఛగా అమ్మారు. పంజాగుట్ట నుంచి కోఠి వరకూ ఉన్న ఔషధ దుకాణాల్లో పరిశీలించగా, చాలా దుకాణాల్లో మందులిచ్చే వారెవరూ తెల్లకోటు ధరించలేదు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, తదితర ప్రాంతాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ జరిపిన పరిశీలనలోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. ఔషధ నియంత్రణ సంస్థ ఆకస్మిక తనిఖీల్లో కూడా పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

విచ్చలవిడిగా విక్రయాలు

రాష్ట్రంలోని మందుల దుకాణాల్లో మత్తును కలిగించే ఔషధాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. యాంటీ డిప్రెషన్‌, యాంటీ అలర్జీ, అధిక మోతాదు నొప్పి నివారణ మాత్రలు, దగ్గు ద్రావణాలను కచ్చితంగా వైద్యుల చీటీ ఉంటేనే విక్రయించాల్సి ఉండగా, దుకాణాలు ఈ నిబంధనను ఖాతరు చేయడం లేదు. దాదాపు మూడొంతుల దుకాణాల్లో అర్హులైన ఫార్మసిస్టులే లేరు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో 200కి పైగా దుకాణాల్లో నిబంధనలను పాటించడంలేదని అధికారులు గుర్తించారు. వాటిని సత్వరమే మూసివేయించామని, దుకాణదారులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొంది.

అధిక మోతాదు ముప్పే..

‘పారాసెటమాల్‌, డైసైక్లోమైన్‌, ట్రెమడాల్‌’ సమ్మిళిత ఔషధాన్ని తీవ్రమైన నొప్పి నివారణకు వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ‘ట్రెమడాల్‌’ అనే ఔషధం ‘ఓపియాయిడ్స్‌’ అనే మాదక ద్రవ్యాల జాబితాకు చెందినది. మెదడులోని ‘నోర్‌పైన్‌ఫ్రైన్‌’, ‘సెరోటోనిన్‌’పై పనిచేసి, నొప్పిని తెలియనివ్వదు. కొందరు దీన్ని మత్తు కోసం ఎక్కువ మోతాదులో వాడుతున్నట్లు గుర్తించారు. ఇది ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగర ప్రాంతాల్లో యువత ఇలాంటి మందులను కొన్ని దుకాణదారులతో లాలూచీ పడి కొనుగోలు చేస్తున్నారని ఔషధ నియంత్రణ అధికారి ఒకరు తెలిపారు.

నిబంధనల ఉల్లంఘన

ప్రతి ఔషధ దుకాణంలోనూ కచ్చితంగా ఫార్మసిస్టు సమక్షంలోనే వినియోగదారులకు మందులను విక్రయించాలి. ఫార్మసిస్టు తప్పనిసరిగా తెల్ల కోటు(యాప్రాన్‌) ధరించాలి. వైద్యుల చీటీ జిరాక్స్‌ను దుకాణంలో తప్పనిసరిగా భద్రపరచాలి. ఏ వైద్యుడు రాశారు? ఎన్ని మాత్రలు రాశారు? ఎవరికి ఇచ్చారు? తదితర సమాచారమంతా ఒక పుస్తకంలో రాయాలి. చాలా దుకాణాల్లో ఇవేమీ పాటించడంలేదని తేలింది.

వైద్యుడి చీటీ లేకుండా అమ్ముతున్న ఔషధాలివి..

*యాంటీ డిప్రెషన్‌:డయాజెపమ్‌, నైట్రాజెపమ్‌, మెలటోనిన్‌, మిర్టాజపిన్‌, నార్‌ట్రిప్టిలైన్‌, ట్రాజడోన్‌, జలప్లొన్‌, జోల్‌పిడెమ్‌, జోపిక్లోన్‌
* దగ్గు సిరప్‌లు
* నొప్పినివారణ మాత్రలు: బుప్రెనొర్ఫిన్‌, ట్రెమడాల్‌, టిడిజెసిక్‌, స్పాస్మో ప్రొక్సివోన్‌
*అలర్జీ, జలుబు మాత్రలు:ఫెనిరమైన్‌, క్లోర్‌ఫెనిరమైన్‌ మెలేట్‌, సిట్రజిన్‌, హైడ్రోక్సిజిన్‌

చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి

ట్రెమడాల్‌, పెంటాజోసిన్‌ వంటి ఔషధాలను దీర్ఘకాలం వాడేవారు వాటికి బానిసలైపోతారు. స్టెరాయిడ్స్‌ దీర్ఘకాలం వాడడం వల్ల బీపీ, షుగర్‌ వస్తాయి. ఎముకలు బలహీనమవుతాయి. రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. రాష్ట్రంలోని అత్యధిక దుకాణాల్లో అర్హత కలిగిన ఫార్మసిస్టులు పనిచేయడం లేదు. వైద్యుల చీటీ లేకుండా విక్రయించడం ఒక కుంభకోణంగా మారింది. తగినంత మంది ఔషధ నియంత్రణాధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ కరవైంది. ఔషధ నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి.

- డాక్టర్‌ ఆకుల సంజయ్‌రెడ్డి, ఫార్మకాలజిస్ట్‌, తెలంగాణ ఔషధ మండలి సభ్యులు

ఇదీ చదవండి:Medaram jathara 2022: నేటి నుంచే మేడారం మహాజాతర.. 19 వరకు నిర్వహణ

ABOUT THE AUTHOR

...view details