నగరంలో తొలుత ఖాళీగా కనిపించిన రహదారి మధ్యాహ్నం కనీసం నడిచేందుకు కూడా వీల్లేకుండా మారిపోతుంది. రోడ్లన్నీ వాహనాలు ఆక్రమించేసుకుంటున్నాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెలుపల ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కిక్కిరిసి ఉంటుంది. బస్సులు ఆపేందుకు స్థలమున్నా.. లోపలే ప్రీపెయిడ్ ఆటోలున్నా.. బయట ఆటోలు... బస్సులు అలాగే నిలుపుతున్నారు. చిరువ్యాపారులు రోడ్లపైకి వస్తారు. దీంతో రైల్వేస్టేషన్ నుంచి బయటకు రావాలంటే అక్కడున్న వారందరినీ తోసుకుంటూ రావాల్సిందే..
ప్యారడైజ్... రాణిగంజ్
నిత్యం వాహనాల రద్దీతో ఉండే ప్రధాన రహదారి ప్యారడైజ్-రాణిగంజ్. జేబీఎస్ నుంచి నుంచి ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచే ఆర్టీసీ బస్సులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఎంజీరోడ్ నుంచి రామ్గోపాల్పేట్ పాత పోలీస్ఠాణా, రాణిగంజ్ వరకు రహదారి ఇరుకుగా ఉండడంతో బస్సులు, కార్లు వెళ్లేందుకు ఇబ్బందే. ఈ మార్గంలో దుకాణదారులు స్థలాన్ని ఆక్రమించడం, గాంధీ విగ్రహం వద్ద కార్లు నిలిపేయడంతో వాహనాలు చీమలబారులా వెళ్లాల్సిందే.
నిర్మించేది.. వారికోసమే
మల్కాజిగిరి, సాయినగర్, సఫిల్గూడ చౌరస్తాల్లో ఇప్పటి వరకు ట్రాఫిక్ సిగ్నళ్లు లేవు. రహదారులకు ఇరువైపులా పాదచారుల రక్షణ కోసం కాలిబాటలను ఏర్పాటు చేశారు. ఇవి పాదచారుల కన్నా వ్యాపారులకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. వాహనాల రద్దీ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆనంద్బాగ్లో ఇద్దరు, మీర్జాలగూడలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
విస్తరించినా అదే సమస్య
పంజాగుట్ట-అమీర్పేట రోడ్డుకు రెండువైపులా ఉన్న ప్రైవేటు ఆస్తులకు నష్టపరిహారం చెల్లించి 10అడుగుల మేర విస్తరించారు. అయినా గతంలో ఎలా ఉందో ఇప్పుడూ పరిస్థితి అలాగే ఉందని వాహనదారులు అంటున్నారు. పంజాగుట్ట క్రాస్రోడ్స్ ప్రాంతంలో మార్గం విస్తరించినా దుకాణాదారులు ఆక్రమించుకున్నారు.
- ఖైరతాబాద్ రైల్వేగేట్ నుంచి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వరకూ రహదారిని విస్తరించినా ప్రైవేటు విద్యా,వాణిజ్యసంస్థలు పార్కింగ్ కోసం వినియోగించుకుంటున్నాయి. సర్కిల్ కార్యాలయం వద్ద రహదారి ఇరుకుగా ఉన్నా.. పార్కింగ్ చేస్తున్నారు.