TSPSC Paper Leakage Case Updates: తవ్వే కొద్దీ కొత్త కోణాలు, వరుస అరెస్టులు, ఉత్కంఠను రేపే పరిణామాలతో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చోటుచేసుకున్న లీకేజీ వ్యవహారం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఇప్పటి వరకు కమిషన్ కార్యాలయ ఉద్యోగులు, రాష్ట్రానికి చెందిన పలువురిని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ వ్యవహారంతో సంబంధమున్న ప్రవాస భారతీయులను ప్రశ్నించాలని భావిస్తోంది. విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు గ్రూప్-1 పరీక్ష రాసి వెళ్లినట్లు సిట్ ఒక అంచనాకు వచ్చింది.
కీలక నిందితుడైన రాజశేఖర్రెడ్డి సమీప బంధువు న్యూజిలాండ్ నుంచి వచ్చి పరీక్ష రాసినట్లు అధికారులు తేల్చారు. ఈ జాబితాలో మరికొందరు కూడా ఉన్నట్లు గుర్తించటంతో వారికీ నోటీసులు ఇచ్చి పిలిపించనున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రం కఠినతరంగా రావటంతో సివిల్స్కు సన్నద్ధమైన అభ్యర్థులు సైతం 100 మార్కులు సాధించడమే గగనమైంది. కానీ పలువురు అభ్యర్థులకు 120 మార్కులు దాటడంతో విచారణాధికారులే విస్తుపోయారు. ఈ క్రమంలోనే వందకు పైగా మార్కులు సాధించిన వారి జాబితాను పరిశీలించగా.. ప్రవాస భారతీయుల పేర్లు బహిర్గతం కావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ కేసులో తాజాగా అరెస్టైన షమీమ్కు గ్రూప్-1లో 126 మార్కులు, రమేశ్కు 120 మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
టీఎస్పీఎస్సీ ఉద్యోగి అయిన షమీమ్కు ప్రధాన నిందితుడు రాజశేఖర్రెడ్డి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కర్నూల్ జిల్లా బనగానపల్లెకు చెందిన షమీమ్.. మహబూబ్నగర్కు వచ్చి స్థిరపడింది. అక్కడే ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న ఆమె కొన్నాళ్లు భర్తతో పాటు దుబాయ్లో ఉంది. గతంలో ఓ సారి గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. 2013లో గ్రూప్-2 ఉద్యోగిగా ఎంపికైన షమీమ్ ప్రస్తుతం టీఎస్పీఎస్సీలోని గ్రూప్-4 సెక్షన్లో పని చేస్తోంది.
paper leakage case: ఈమెను సిట్ అధికారులు గత బుధవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనకు రాజశేఖర్ రెడ్డి వాట్సప్లో ప్రశ్నాపత్రాన్ని పంపించినట్లు వెల్లడించింది. ఇందుకోసం తాను డబ్బులేమీ ఇవ్వలేదని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఆమె పాత్రపై నిర్ధారణకు రావడంతో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే షమీమ్ ఇంట్లో సోదాలు జరిపిన సిట్ బృందం కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో 20 మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా.. వారిలో 8 మంది ప్రాథమిక పరీక్ష అర్హత సాధించారు. ఈ 8 మందిలో ఇద్దరికి 100కు పైగా మార్కులు రాగా ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొత్తంగా 100 మార్కులకు పైగా సాధించిన 121 మందిలో ఇంకా ఎందరు దొంగలు ఉన్నారో తేల్చడం ఇప్పుడు సిట్ ముందున్న ప్రధాన అంశంగా మారింది. ఈ క్రమంలో విదేశాల్లోని ప్రవాస భారతీయులను రప్పించి విచారించడంతో పాటు మిగిలిన వారి పాత్రను నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది.