ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆడవాళ్లు ఏదో ఒక రకంగా హింసకు గురవుతూనే ఉన్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఆగడాలు ఆగట్లేదు. ఇలా రాన్రానూ మహిళలకు రక్షణ కొరవడుతుందన్న విషయం మనం రోజూ చూసే కొన్ని సంఘటనల ద్వారానే తేటతెల్లమవుతుంది. అయితే తాను పనిచేసే చోట మాత్రం ఇలాంటి ఆకతాయిల ఆగడాలు సాగవని అంటున్నారు నోయిడా డీసీపీ వ్రిందా శుక్లా. 2014 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్కు చెందిన ఈ మహిళా ఐపీఎస్.. తాజాగా నోయిడా మహిళల రక్షణ కోసం ‘స్వయం సిద్ధ’ పేరుతో పెట్రోలింగ్ యూనిట్ని ఏర్పాటుచేశారామె. ఈ ఇనీషియేటివ్ని నోయిడా కమిషనర్ పచ్చజెండా ఊపి ఇటీవలే ప్రారంభించారు.
మహిళా సంచారం ఉన్న చోట..!
దాదాపు 100 మందితో కూడిన మహిళా పోలీసు బృందంతో ఏర్పాటైన ఈ పెట్రోలింగ్ యూనిట్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్.. తదితర మహిళా పోలీసులు స్కూటీలపై తిరుగుతూ నిరంతరం పహారా కాసేలా ఏర్పాటు చేశారు. మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, కాలేజీలు, ఆటో స్టాండ్స్.. వంటి మహిళా సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీరు మహిళలకు రక్షణగా వారి చుట్టూనే తిరుగుతుంటారని చెబుతున్నారు వృందా. ఈ క్రమంలో స్త్రీలను ఆటపట్టించే ఆకతాయిల పని పట్టడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటారీ మహిళా రక్షక భటులు. అలాగే వీరంతా పోలీసు యూనిఫాం ధరించినప్పటికీ దాని పైనుంచి పింక్ కలర్ జాకెట్ వేసుకొని, తలకు హెల్మెట్ పెట్టుకొని తమకు నిర్దేశించిన ప్రదేశాల్లో స్కూటీలపై తిరుగుతూ గస్తీ కాస్తారు.