తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2020, 5:57 AM IST

Updated : Feb 2, 2020, 7:46 AM IST

ETV Bharat / state

ఎప్పటిలాగే.. పాతపాటే.. మరోసారి మొండి చెయ్యే!

రాష్ట్రానికి కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు వరుసగా ఏడో ఏడాది కూడా నిరాశే మిగిల్చింది. కొత్త నిధులు రాష్ట్రానికి అందకపోగా పన్నుల వాటా తగ్గింది. బడ్జెట్‌కు ముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలన్నీ బుట్టదాఖలయ్యాయి. సాగునీటి రంగానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జాతీయ ప్రాజెక్ట్, కాళేశ్వరం నిర్వహణకు నిధులు కోరినా.. ఫలితం లేకుండా పోయింది.

No special funds to the state in central budget 2020
ఎప్పటిలాగే.. పాతపాటే.. మరోసారి మొండి చెయ్యే!

రాష్ట్రానికి మరోసారి నిరాశే

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్వహించిన ప్రీ- బడ్జెట్ సమావేశంలో... రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అంశాలకు కేంద్ర బడ్జెట్​లో స్థానం దక్కలేదు. పన్నుల వాటా, గ్రాంట్​ ఇన్ ఎయిడ్ ద్వారా అందే నిధులు మినహా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ నుంచి ఎలాంటి సహకారం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. ఐదేళ్లుగా పెండింగ్​లో ఉన్న ఈ అంశం సాకారమయ్యేలా కేంద్ర బడ్జెట్​లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కేంద్ర బడ్జెట్​లో బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రస్తావనే లేదు.

కాళేశ్వరానికి కేటాయింపులే లేవు..

లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం.. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 2020- 21 కేంద్ర బడ్జెట్​లో నిధుల తోడ్పాటును అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్​లో కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లను ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని మూడేళ్ల క్రితం కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రికి వివరిస్తూ... నిధులు ఇవ్వాలని కోరగా బడ్జెట్​లో ఒక రూపాయి కూడా దీనికి కేటాయించలేదు.

కొనసాగిన పాత విధానం..

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు కాకుండా 32 జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఇవ్వాలని రాష్ట్రం విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్ర జాబితాలోని అంశాలు సగటున 14 నుంచి 20 శాతం మేరకు పెరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని వివరించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా పథకాలను రూపొందించుకునే అవకాశం రాష్ట్రాలకు ఇచ్చి కేంద్రం నిధులు తోడ్పాటు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదించినా పాత విధానమే కొనసాగింది.

రాష్ట్ర ఖజానాపై భారం..

ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక తోడ్పాటును ఇచ్చి అండగా నిలవాలని కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. తగ్గిన పన్నుల వాటా కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి ఈ ఏడాది వాటా మరింత తగ్గింది. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నుల వాటాగా రూ.16,726 కోట్లు రానుంది. రాష్ట్రానికి గత రెండేళ్లుగా కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గుతూ వస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో కేంద్రం నుంచి పన్నులవాటా 2.13 శాతంగా నిర్ధరించి రూ.16,726.58 కోట్లు ప్రతిపాదించారు. సగటున నెలకు రూ.1,393 కోట్లు కేంద్రం నుంచి రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నులవాటాగా రాష్ట్రానికి రూ.17,422 కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ.15,987 కోట్లు మాత్రం రానుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.17,960 కోట్లు కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర పన్నుల వాటా తగ్గడం రాష్ట్ర ఖజానాపై భారాన్ని పెంచనుంది.

సాగునీటి రంగానికి మొండిచెయ్యే..

ఎత్తిపోతల పథకాలపై ఆధారపడ్డ రాష్ట్రానికి సాగునీటి రంగంలో తగిన ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని ఎప్పట్నుంచో కోరుతున్నా.. మొండి చెయ్యే మిగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి తగిన నిధులు ఇవ్వాలని పలు దఫాలుగా విజ్ఞప్తి చేసింది. కానీ తాజా బడ్జెట్లో ఆ ప్రస్తావన ఏ మాత్రం కనిపించలేదు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా.. సత్వర సాగునీటి ప్రయోజన పథకానికి కేంద్ర బడ్జెట్లో రూ.5,126 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్​తో పోలిస్తే కేవలం రూ.1,012 కోట్లు మాత్రమే ఎక్కువ. ఈ కేటాయింపుల్లోనూ రూ.2,675 కోట్లు రుణాలకు వడ్డీ చెల్లించేందుకు వెళ్లనున్నాయి. మిగిలిన మొత్తాన్ని నాబార్డు వివిధ ఎత్తిపోతల పథకాలకు ఖర్చు చేయనుంది.

నదుల అనుసంధానానికి కేటాయింపు లేవి?

సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రాష్ట్రానికి సంబంధించిన 11 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి ఏ మేరకు నిధులు అందుతాయన్నది తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం చేపడతామని కేంద్రం గతంలో ప్రకటించింది. కానీ బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం చేయలేదు. కృష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున... గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్​కు తీసుకెళ్లాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సన్నద్ధం అవుతున్నాయి. నదుల అనుసంధానం కేంద్రం చేపడితే ఆ నిధులు ఉపయోగించుకోవచ్చని భావించారు. కానీ నదుల అనుసంధానానికి కేంద్రం నిధులు కేటాయించలేదు.

బడ్జెట్ 2020: నిర్మలమ్మ బడ్జెట్ విశేషాలివే

Last Updated : Feb 2, 2020, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details