తెలంగాణ

telangana

ETV Bharat / state

'సురభి'ని బతికించేవారెవరు? - no food and maintainence for surabhi natakamandali

సురభి... ఈ పేరు వినగానే ఓ పద్యనాటకమో లేక మాయబజార్ లాంటి అద్భుత ప్రదర్శనో గుర్తొస్తుంది. తాతముత్తాల నుంచి తరతరాలుగా నాటకాన్ని బతికిస్తూ... సమాజాన్ని అలరిస్తూ వస్తోన్న సురభి కళాకారులు లాక్​డౌన్​లో రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నాటకాల ప్రదర్శన లేక జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో గడుపుతున్నారు. హైదరాబాద్ లలితకళాతోరణం సమీపంలో సంవత్సరాల తరబడి నాటకాలు వేస్తూ జీవించిన సురభి కళాకారులవైపు తొంగిచూసే నాథుడు లేక తీవ్రఅవస్థలు పడుతున్నారు.

no food and maintenance for surabhi artists
'సురభి'ని బతికించేవారెవరు?

By

Published : Apr 21, 2020, 8:09 PM IST

Updated : Apr 21, 2020, 8:54 PM IST

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్ సగటు జీవిని ప్రాణభయంతో పరుగులు పెట్టిస్తోంది. అన్నమో రామచంద్రా అని అర్థించేలా చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లలిత కళాతోరణం ఆవరణలో నాటకాలు ప్రదర్శిస్తూ జీవిస్తున్న సురభి కుటుంబాల కడుపులపై కరోనా దెబ్బకొట్టింది. శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి పేరుతో గత 15 ఏళ్లుగా నాటకాలు వేస్తూ 12 కుటుంబాలు జీవించేవి. అందులో కొందరు లింగంపల్లిలోని సురభి కాలనీకి వెళ్లిపోగా మరికొంత మంది ఇక్కడే ఉండి జీవిస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని రేకుల షెడ్డు కింద ఇరుకుగదుల్లో జీవనం సాగిస్తున్నారు. నాటకం తప్ప మరే వ్యాపకం తెలియని ఈ కళాకారులు.. 100 మంది వచ్చినా... ఒక్కరు వచ్చినా నాటకాన్ని ప్రదర్శిస్తూ సురభి పేరును సుస్థిరం చేశారు. ఆ కళను మనదేశపు ఆస్తిగా మార్చారు.

ఎటూ కదల్లేని పరిస్థితి..

కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. సురభి కళాకారుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. సాధారణ ప్రజలకు మార్చి నుంచి లాక్ డౌన్ మొదలైతే ఈ కళాకారుల కుటుంబాలకు మాత్రం ఫిబ్రవరి నుంచే మొదలైంది. నాటకాలు ప్రదర్శించే ప్రాంగణంలో గాలివానకు రేకులషెడ్డు కుప్పకూలింది. నాటకాల ప్రదర్శన ఆగిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. మరోచోటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా వైరస్ కమ్ముకొచ్చింది. లాక్​డౌన్​తో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు.

ఎవరూ పట్టించుకోరే..!

గత 25 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికి వీరివైపు తొంగిచూసిన నాథుడే లేడు. ఉన్నదాంట్లోనే తింటూ కూలిపోయిన రేకుల షెడ్డులోనే పిల్లాపాపలతో రేపటి కోసం ఎదురుచూస్తున్నారు. 5 తరాలుగా నాటకాలు వేస్తున్న ఈ కుటుంబాల్లో చాలా మంది వృద్ధులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనీసం మందులు కూడా కొనుగోలు చేసే శక్తిలేక మంచానికే పరిమితమవుతున్నారు. ఈ కుటుంబాలకు పెద్దదిక్కైన సురభి బాబ్జి కూడా ఇటీవలే అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లల చదువులు, పరీక్షలు అర్థాంతరంగా ఆగిపోవడం, వేరేచోటకు వెళ్లిపోదామన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో పడ్డామని సురభి కళాకారులు వాపోతున్నారు.

'సురభి'ని బతికించేవారెవరు?

ఇవీ చూడండి:కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?

Last Updated : Apr 21, 2020, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details