తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​... వ్యాపారాలు డీలా

లాక్​డౌన్ వల్ల దాదాపు రెండు నెలల పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా అన్ని రకాల దుకాణాలు తెరుచుకున్నాయి. ఎంతో ఆశతో వ్యాపారం పునఃప్రారంభించిన వ్యాపారులు... ప్రస్తుతం నిరాశగానే ఉన్నారు. సాధారణ రోజులతో పోలిస్తే 25శాతం కూడా వ్యాపారం జరగట్లేదని ఆందోళన చెందుతున్నారు.

By

Published : May 23, 2020, 5:31 PM IST

NO_BUSINESS_IN_CORONA time
లాక్​డౌన్​ ఎఫెక్ట్​... దుకాణాలకు 'కరోనా' దెబ్బ

కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. వ్యాపారులు, ప్రజల సౌకర్యార్థం లాక్‌డౌన్ నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది. మొదట గ్రీన్ జోన్లలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాగా.. జీహెచ్​ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువగా ఉండటంతో కాస్త ఆలస్యంగా ఇక్కడ దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈనెల 19 నుంచి హైదరాబాద్‌లో కొన్ని మినహాయిస్తే.. మిగతా దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చూస్తూ.. శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు.

లాక్ డౌన్ ను ఆసరా చేసుకొని జగదీశ్ మార్కెట్ లో వ్యాపారులు ఎక్కువ ధరలు చెబుతున్నారు. అక్కడే ఉన్న పోలీసుకు చెబితే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయమన్నాడు. చేసేది లేక స్క్రీన్ కొనకుండానే వెళ్లిపోతున్నాను.

- వినియోగదారుడు

వినియోగదారులను షాపులోకి రానివ్వడం లేదు. వారికి కావాల్సిన వస్తువుల గురించి అడిగి మేమే బయటికి తెచ్చి ఇస్తున్నాము. మాస్క్ లేకపోతే వాళ్లకు వస్తువులను విక్రయించడం లేదు.

- విక్రయదారుడు

అధిక ధరలకు..

వ్యాపారులు వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు కొందరు వినియోగదారులు చెబుతున్నారు. ప్రస్తుతం సరుకు రావడంలేదని.. వచ్చిన కొద్దిపాటి సరుకును డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీసుకునేందుకు అధిక ధర చెల్లిస్తున్నామని వారు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల విడిభాగాలు.. 50శాతం ఎక్కువ చేసి అమ్ముతున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల తర్వాత దుకాణాలు తెరచిన వ్యాపారులకు నిరాశే ఎదురవుతోంది.

'మేమూ కష్టాల్లోనే..'

ఆశించిన మేర వ్యాపారం లేదని.. లాక్‌డౌన్ సమయంలోనూ తమ సిబ్బందికి జీతాలు చెల్లించామని అంటున్నారు. ప్రతి నెలా దుకాణం నిర్వహణ కోసం కరెంట్ బిల్లు, ఇతర ఖర్చుల కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా.. కరోనా భయానికి ప్రజలు బయటికి రావడం లేదు. చేతిలో డబ్బులు లేక.. విలాసాలకు కాకుండా అత్యవసర, నిత్యావసరాలకే మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఫలితంగా వ్యాపారాలన్నీ బోసిపోతున్నాయి. వ్యాపార సముదాయాలు సరిబేసి సంఖ్యలో తెరుచుకున్నా.. కొనుగోలుదారులు లేక వ్యాపారులు దిగులు పడుతున్నారు.

రెండు నెలలుగా దుకాణంలో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాం. మా వ్యాపారం నిత్యావసరాలు కావు కాబట్టి.. ప్రజలు కొనుగోలు చేయడానికి మరో రెండు నెలలు పడుతుంది. అప్పటివరకు దుకాణాన్ని నష్టాల్లో తెరవడం తప్ప మరో మార్గం లేదు.

- ప్రవీణ్, హరిదాస్ మార్కెట్, కోఠి

వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే.. వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి :'కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పినా వైద్యం చేయలేదు'

ABOUT THE AUTHOR

...view details