గ్రేటర్లో కొవిడ్ వ్యాప్తిని, ప్రజల్లోని వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేసేందుకు ఎన్ఐఎన్ భారీ ‘సీరో’ సర్వే చేపట్టనుంది. ఈ కార్యక్రమం నేటి నుంచి అమలు కానుంది. దీని ద్వారా ఇప్పటి వరకు నగరంలో ఎంత మంది కొవిడ్ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నారనేది తేలుతుంది. కొవిడ్ వ్యాక్సిన్ అనంతరం ఇదే తరహాలో మళ్లీ ‘సీరో’ సర్వే జరగనుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎంత మందికి, ఏ స్థాయిలో రోగ నిరోధక కణాలు ఉత్పత్తయ్యాయో లెక్క తేలుతుంది. వాటి ఆధారంగా సామూహిక వ్యాధి నిరోధకశక్తి(హెర్డ్ ఇమ్యునిటీ)ని లెక్కించడం సాధ్యమవుతుందని ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ.లక్ష్మయ్య తెలిపారు.
గతంలో ఇలా.. గతేడాది మేలో ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో సీరో సర్వే జరిగింది. ఆదిభట్ల, టప్పాచబుత్ర, మియాపూర్, చందానగర్, బాలాపూర్ ప్రాంతాల్లో 500 నమూనాలు పరీక్షిస్తే 15 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఇలా.. నగరంలో 8 నెలల అనంతరం రెండోసారి సీరో సర్వే జరుగుతోంది. ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు 30 వార్డులను ర్యాండమ్గా ఎంచుకున్నారు. ఒక్కో వార్డులోని 100 ఇళ్లలో రక్త నమూనాలు తీసుకోనున్నారు.