తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2020, 2:10 PM IST

Updated : Jan 5, 2020, 7:10 PM IST

ETV Bharat / state

ఆన్​లైన్​ ఆఫర్లే గాలం... మార్కెట్​లోకి సరికొత్త సైబర్​మోసం!

మార్కెట్​లోకి సరికొత్త మోసం వచ్చింది. మీరు తరచూ... ఆన్​లైన్​లో షాపింగ్​ చేస్తున్నారా...? తక్కువ ధరలకే వస్తువులు కొంటున్నారా...? ఆఫర్ల కోసం పిచ్చిగా వెతుకుతున్నారా...? ఈ-కామర్స్​ వెబ్​సైట్లు మీకోసం ప్రత్యేక ఆఫర్ అంటూ పంపిన మెసెజ్​లు, లింక్​లు క్లిక్​ చేసి ఆర్డర్లేమైనా ఇచ్చారా...? అయితే... సరికొత్త అవతారమెత్తిన సైబర్​నేరగాళ్ల బుట్టలో పడ్డట్టే...! మీరు కొన్నది చిన్న వస్తువైనా సరే... కళ్లు బైర్లు కమ్మే బహుమతి మీకొచ్చిందంటూ... చెప్పే మాటలు నమ్మారో... ఉన్నది అమ్ముకోవటం ఖాయమే అంటున్నారు పోలీసులు.

NEW CYBER CRIME IN MARKET... WITH ONLINE OFFERS, GIFTS TO ONLINE PRODUCTS
NEW CYBER CRIME IN MARKET... WITH ONLINE OFFERS, GIFTS TO ONLINE PRODUCTS

ఆన్​లైన్​ ఆఫర్లే గాలం... మార్కెట్​లోకి సరికొత్త సైబర్​మోసం!

"మా వైబ్​సైట్​లో వెజిటెబుల్​ కట్టర్​ కొన్నందుకు శుభాకాంక్షలు. రూ.6లక్షల 90 వేలు విలువ చేసే కారు కోసం మీ పేరు ఎంపికైంది. ఒకవేళ కారు వద్దనుకుంటే... నగదు తీసుకోవచ్చు" అనే మెస్సేజ్​ వచ్చింది సైబరాబాద్​కు చెందిన ఓ మహిళకు. మూడు నెలల క్రితం రెండు వందలతో కూరగాయలు తరిగే సాధనం కొంటే... ఏకంగా ఆరు లక్షల విలువైన కారే వచ్చిందని ఆనందంతో ఉబ్బి తబ్బిబైంది. ఆ నంబర్లకు ఫోన్ చేసి వారు చెప్పినట్లు చేసింది. డబ్బులు కట్టింది. అంతా అయ్యాక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే గానీ అర్థం కాలేదు మోసపోయిందని...!

ఎలా బుట్టలో వేసుకున్నారంటే...

మూడు నెలల కిందట ఒక వెజిటేబుల్​ కట్టర్ ఆన్​లైన్​లో ఆర్డరిచ్చింది సైబరాబాద్​ మహిళ. నిర్దేశించిన గడువు లోపు వస్తువు ఇంటికి చేరుకుంది. డబ్బులు కట్టేసి ఆ ప్రొడక్ట్​ను తీసుకుంది. నెల రోజుల తర్వాత మహిళ చరవాణికి ఓ మెస్సేజ్​ వచ్చింది. మెస్సెజ్​ను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై... మరుక్షణమే అందులో వచ్చిన టోల్​ఫ్రీ నంబర్​కు ఫోన్ ​చేసింది. టాటా నెక్సస్ కారుకు ఎంపికయ్యారని... రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద రూ.6,500 చెల్లించాలని అవతలి వ్యక్తి కోరారు. ఎస్బీఐ ఖాతా నంబర్​ పంపించగా... ఆ మహిళ డబ్బులు వేసింది. ఆ తర్వాత ఆర్టీవో ఛార్జీల కోసం రూ.24,600, జీఎస్టీ కింద రూ.18వేలు, బీమా కింద రూ.31వేలు.. ఇలా పలు పేర్లతో మహిళ నుంచి రూ.2లక్షల 30వేలు వసూలు చేశారు.

సరికొత్తగా మోసం...

నిర్దేశించిన సమయంలో కారు రాకపోవటం వల్ల మహిళ పదేపదే ఫోన్ చేసింది. కానీ ఆ నంబర్​ స్విచ్ ఆఫ్​ రావటం వల్ల... మోస పోయానని గమనించింది. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి... జరిగిందంతా వివరించింది. దర్యాప్తు చేసిన పోలీసులు... ఇది మార్కెట్​లోకి వచ్చిన సరికొత్త మోసమని గుర్తించారు. ఏ ఈ-కామర్స్​ వెబ్​సైట్​ కూడా ఇలాంటి ఆఫర్లు ఇవ్వవని... ఇలాంటి గాలాలకు ఎవ్వరూ పడొద్దని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ హెచ్చరించారు.

ముఠా చేతిలో లక్ష మంది వివరాలు...

సైబరాబాద్ మహిళను మోసం చేసింది బిహార్​లోని కబీర్ పురా ముఠాగా సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. స్నాప్​డీల్, అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ వంటి ఆన్​లైన్ విక్రయ సంస్థల్లో వినియోగదారుల చరవాణి నంబర్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కొన్ని వాణిజ్య సంస్థలను ప్రలోభపెట్టి వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నట్లు తేలింది. కబీర్ పురా ముఠా ఇప్పటి వరకు పలు సంస్థల నుంచి సుమారు లక్ష మంది వివరాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని బహుమతులు, లాటరీల పేరుతో నమ్మించి రూ.5కోట్ల వరకు కొల్లగొట్టారు.

బినామీ సంస్థ... నమ్మించేందుకు ఉద్యోగులు..

ముఠాలో సందీప్ కుమార్ ప్రధాన సూత్రధారిగా మోసాలకు పాల్పడ్డాడు. దిల్లీకి చెందిన తౌసీఫ్ అహ్మద్, వికాస్ కుమార్ సహకారంతో బినామీ సంస్థను ఏర్పాటు చేసి... 9 టోల్ ఫ్రీ నంబర్లు తీసుకున్నారు. రోజుకు సుమారు 50 నుంచి 100మందికి సందేశాలు పంపడం... వారికి ఫోన్ చేసి మాయమాటలు చెప్పి నమ్మించడం కోసం నలుగురు ఉద్యోగులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. రోజుకు వంద మందికి ఫోన్ చేస్తే అందులో కనీసం ఒకరిద్దరైనా మోసపోతున్నారు. ఆఫర్ల పేరిట ప్రలోభపెట్టే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్​ క్రైం అదనపు డీసీపీ కవిత హెచ్చరించారు.

వినియోగదారుల వివరాలు బయటి వ్యక్తులకు అందుతుండటాన్ని సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆన్​లైన్​ విక్రయ సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తామని... లేకపోతే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...

Last Updated : Jan 5, 2020, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details