తెలంగాణ

telangana

ETV Bharat / state

అస్తవ్యవస్థమైన నాలాల నిర్వహణతో వారం రోజుల్లోనే ఇద్దరు బలి - నాలాలో కొట్టుకుపోయిన నవీన్​

హైదరాబాద్ సరూర్ నగర్​లోని మినీట్యాంక్​బండ్ వద్ద కొట్టుకుపోయిన నవీన్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగినప్పటి నుంచి దాదాపు 20గంటలు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, డీఆర్​ఎఫ్ సిబ్బంది మృత దేహాన్ని బయటకు తీశారు.

naveen dead body found in saroornagar lake
అస్తవ్యవస్థమైన నాలాల నిర్వహణతో వారం రోజుల్లోనే ఇద్దరు బలి

By

Published : Sep 22, 2020, 5:14 AM IST

అస్తవ్యవస్థమైన నాలాల నిర్వహణతో వారం రోజుల్లోనే ఇద్దరు బలి

మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన నవీన్ కుటుంబంతో పాటు 20ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. అల్మాస్​గూడలో నివాసం ఉంటూ స్థానికంగా ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తున్నాడు. ఆదివారం సరూర్‌నగర్‌ చెరువుకట్ట కింద నుంచి తపోవన్‌ కాలనీమీదుగా స్కూటీపై సరూర్‌నగర్‌ వైపు వెళ్తున్నాడు. నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లభించలేదు. చూస్తుండగానే చెరువులోకి కొట్టుకుపోయాడు.

20 గంటలపాటు శ్రమించి..

ఘటనపై సమాచారం అందిన వెంటనే జీహెచ్​ఎంసీ, పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. అధునాతన బోట్లతో రాత్రి నుంచి తెల్లవారుజామున 3గంటల వరకూ గాలింపు కొనసాగించారు. చెరువులో బురద ఎక్కువగా ఉండటంటో తిరిగి మళ్లీ ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలించారు. 20 గంటలు శ్రమించిన తర్వాత చివరకు ఘటన జరిగిన స్థలానికి 100మీటర్ల దూరంలో చెరువులో నవీన్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నవీన్‌ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సుమేధ ఘటన జరిగి వారం తిరగకముందే మరో ఘటన జరగడం వల్ల స్థానికులు జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి..

నవీన్ వరదలో కొట్టుకుపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి పరిశీలించారు. నగర అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని... పరిహారంగా 50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక బృందాలను అభినందించిన సీపీ

ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌... ఎన్డీఆర్‌ బృందాలను అభినందించి ప్రోత్సాహకం అందించారు. చుట్టుపక్కల 35 కాలనీల్లో పరిస్థితి ఇదే విధంగా ఉందని స్థానికులు సీపీకి వివరించారు. చెరువులోని చాలా ప్రాంతం కబ్జాలకు గురైందని తెలపగా...వివిధ శాఖలతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇప్పటికైనా స్పందించండి

ఏళ్ల తరబడి తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని... చెరువు, నాలాల చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తాజా ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఇవీ చూడండి:సరూర్​నగర్​ వరద నీటిలో యువకుడు గల్లంతు!

ABOUT THE AUTHOR

...view details