తెలంగాణ

telangana

ETV Bharat / state

Darbhanga Blast: హైదరాబాద్‌ రానున్న ఎన్‌.ఐ.ఎ.. దర్బంగా కేసులో అభియోగపత్రం..! - National Investigation Agency news

సంచలనం సృష్టించిన దర్బంగా పేలుడు (Darbhanga Blast) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) త్వరలోనే అభియోగపత్రాలు దాఖలు చేయనుంది. దీనిలో భాగంగా ఎన్‌.ఐ.ఎ. బృందం మరోమారు హైదరాబాద్‌ సందర్శించే యోచనతో ఉంది.

Darbhanga Blast
దర్బంగా పేలుడు

By

Published : Nov 2, 2021, 11:33 AM IST

దర్భంగా పేలుడు (Darbhanga Blast) కేసు నమోదు చేసి 4 నెలలు కావస్తున్నందున త్వరలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 17న బిహార్‌లోని దర్భంగా (Darbhanga Blast) రైల్వేస్టేషన్‌ ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై దుస్తుల మూటను తరలిస్తుండగా బాంబు పేలింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. తొలుత దర్బంగా (Darbhanga Blast) రైల్వే పోలీసులే కేసు నమోదు చేసినప్పటికీ ఇందులో ఉగ్రకోణం ఉండటంతో ఎన్‌.ఐ.ఎ. దిల్లీ విభాగానికి బదిలీ చేశారు.

పేలుడు కుట్ర

దర్బంగా (Darbhanga Blast)లో పేలిన మూట సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బుక్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాంతో హైదరాబాద్‌ వచ్చిన అధికారుల బృందం జూన్‌ 30న నాంపల్లిలో నివసిస్తున్న ఇమ్రాన్‌ మాలిక్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, నాసిర్‌ఖాన్‌ అలియాస్‌ నాసిర్‌ మాలిక్‌ అనే అన్నదమ్ముల్ని అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రోద్బలంతో పాకిస్థాన్‌లో ఉంటున్న ఇక్బాల్‌ఖాన్‌ అదేశాల మేరకు మాలిక్‌ సోదరులు రైలులో పేలుడుకు కుట్ర పన్నినట్లు తేలింది. తదనంతర దర్యాప్తులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామిలీ జిల్లా ఖైరాన్‌కు చెందిన మహ్మద్‌ సలీమ్‌ అహ్మద్‌, ఖలీల్‌లను పట్టుకుంది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని ఎన్‌.ఐ.ఎ. అరెస్టు చేసింది.

దుస్తుల మూట మధ్యలో బాంబు..

2013లో పాకిస్థాన్‌ వెళ్లి వచ్చిన నాసిర్‌ మాలిక్‌ అప్పుడే ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. దుస్తుల వ్యాపారి ముసుగులో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి అప్పటి నుంచీ స్లీపర్‌సెల్‌గా పనిచేస్తున్నాడు. నడుస్తున్న రైల్లో బాంబు పేల్చడం ద్వారా భారీ ప్రాణనష్టాన్ని కలిగించాలన్న వ్యూహంలో భాగంగా స్థానికంగా రసాయనాలను సేకరించి బాంబు తయారుచేశాడు. దీన్ని దుస్తుల మూట మధ్యలో పెట్టి దర్బంగా (Darbhanga Blast) కు బుక్‌ చేశాడు. ప్రయాణం మధ్యలో బాంబు పేలి రైలులో మంటలు వ్యాపించేలా వ్యూహం పన్నాడు. కానీ ప్రయాణ సమయంలో బాంబు పేలలేదు. స్టేషన్లో దింపిన తర్వాత పేలింది. అప్పట్లో హైదరాబాద్‌ వచ్చిన ఎన్‌.ఐ.ఎ. బృందం చిక్కడపల్లి ప్రాంతంలో రసాయనాలు కొన్నట్లు తేలడంతో ఆయా దుకాణాల నుంచి సంబంధిత రసీదులు, సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించింది. ఇప్పుడు మరోమారు హైదరాబాద్‌ వచ్చి నేరానికి పాల్పడిన విధానాన్ని పునఃపరిశీలించాలనే యోచనతో ఉంది.

ఇదీ చూడండి:Darbhanga blast: కాసేపట్లో ఎన్​ఐఏ కోర్టుకు దర్భంగా పేలుడు కేసు నిందితులు

ABOUT THE AUTHOR

...view details