National Farmers Round Table: జాతీయ రైతు సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పసుపు రైతు సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి నరసింహనాయుడుకు ఆహ్వానం లభించింది. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులపాటు బెంగళూరు జీకేవీకే విశ్వవిద్యాలయం ప్రాంగణంలో భారత పసుపు రైతుల సమాఖ్య, కర్ణాటక చెరుకు రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. కర్ణాటక రైతు నేత కె.శాంతకుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు పది రాష్ట్రాల నుంచి రైతు నాయకులు హాజరుకానున్నారు.
తెలంగాణ పథకాలపై చర్చ
కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో పాటు వివిధ రాష్ట్రాల రైతు సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు, పెద్ద ఎత్తున సాగు నీటి వనరుల కల్పన, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా వంటి వివిధ రకాల ప్రోత్సాహకాలపై సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని కలిసి తెలంగాణ ఆదర్శ పథకాలు కర్ణాటకలో కూడా అమలు చేయాలని కోరనున్నారు.