వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ నల్లచెరువు వద్ద నాలాను పూడ్చేస్తూ.. దర్జాగా నిర్మాణాలు చేస్తున్నప్పటికీ ఉప్పల్ సర్కిల్ టౌన్ ఫ్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా అవుతున్నప్పటికీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ స్థలం దాదాపు రూ. 10కోట్లకుపైగా ఉంటుందని అంచనా.
పైవంతెన దిశ మారడంతో..
వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్ రింగురోడ్డు-నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకు స్తంభాలు నిర్మిస్తున్నారు. నల్లచెరువు ప్రాంతంలో కొంత చెరువును పూడ్చారు. ఆ పూడ్చిన ప్రాంతంలోనే కొన్ని స్తంభాలను వేస్తున్నారు. వరంగల్ జాతీయ రహదారికి ఒకవైపు చెరువు మరో వైపు నాలా ఉంది. చెరువులోకి వచ్చిన నీరు మత్తడి నుంచి నాలా గుండా మూసీలోకి ప్రవహిస్తుంది. నాలా ఉండటంతోనే స్తంభాలను వేయలేక కారిడార్ దిశ మార్చారు. నిర్మాణానికి అనువుగా చెరువును పూడ్చారు. ఇదే కబ్జాదారుడికి కలిసొచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ నాలాలోనే మట్టిపోసి పూడుస్తున్నారు.
పట్టింపులేని యంత్రాంగం..
గతంలో ఇదే నాలాను కొంత వరకు పూడ్చి ఓ ప్రార్థన మందిరంలో కొంత భాగాన్ని నిర్మించారు. దాని పక్కనే ఉన్న నాలాను మరికొంత పూడ్చి నిర్మాణాలు చేపడుతూ అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. ఎవరికి వారుగా ప్రహారీలు నిర్మించుకుంటున్నారు. మరికొందరు చిన్న చిన్న దుకాణాలను నిర్మించుకొని దందాలు చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఇన్ని రకాలుగా కబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ ఉప్పల్ సర్కిల్ టౌన్ ఫ్లానింగ్ విభాగం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నాలాను పూడుస్తున్నప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులకు పట్టింపు లేకుండాపోయింది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా.. నాలాలను పూడ్చినా ఊరుకునేది లేదని తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలో మట్టిపోసిన వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు బోర్డులను ఏర్పాటు చేస్తామని.. మిగతా శాఖలను సమన్వయం చేసుకుంటూ నాలా పరిరక్షణ చర్యలు చేపడుతామని తెలిపారు.
ఇదీ చూడండి :పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..