తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2020, 6:50 AM IST

ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయాల్లో కొలిక్కి వచ్చిన పునర్​వ్యవస్థీకరణ!

కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ఆ శాఖలో క్షేత్రస్థాయిలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా తహసీల్దారుకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించడంతో ఒకే కార్యాలయంలో రెండు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉండగా.. ఆ తర్వాత తహసీల్దార్ల సేవలు కొనసాగనున్నాయి.

mro and sub registrar share mro office
రెవెన్యూ కార్యలయాల్లో కొలిక్కి వచ్చిన పునర్​వ్యవస్థీకరణ

నూతన రెవెన్యూ చట్టంతో ఆ శాఖలో క్షేత్రస్థాయిలో మార్పులు జరగనున్నాయి. తహసీల్దారుకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించడంతో ఒకే కార్యాలయంలో రెండు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మిగిలిన సమయం తహసీల్దారు సేవలు కొనసాగుతాయి. దీనిపై ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. దీనిని బట్టే ఏ పనికి ప్రజలు ఎప్పుడు రావాలో నిర్ణయించుకోవాలని రెవెన్యూశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

ఇన్నాళ్లూ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలతో ప్రోటోకాల్‌ విధులతో తహసీల్దార్లు క్షేత్రస్థాయి పర్యటనలకే పరిమితమయ్యేవారు. ఇప్పుడీ బాధ్యతలను పూర్తిగా డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం అప్పగిస్తోంది. ఏదైనా అత్యవసర సందర్భంలో మాత్రం హాజరుకావొచ్చని సూచించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం, చెక్కుల పంపిణీ తదితర కార్యక్రమాలకు కూడా డిప్యూటీ తహసీల్దార్లే హాజరుకానున్నారు.

తహసీల్దార్లకు మరోసారి శిక్షణ

రిజిస్ట్రేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా 443 మంది తహసీల్దార్లకు 2018లో 10 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మూడు రోజులు రిజిస్ట్రేషన్ల విధానంతో పాటు చట్టాలు, సబ్‌రిజిస్ట్రార్‌, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విధులపై అవగాహన కల్పించారు. ఆరు రోజుల పాటు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రయోగాత్మక శిక్షణ పొందారు. ఒకరోజు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో విధులను తెలుసుకున్నారు. వారికి మరోసారి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్‌ వ్యవస్థీకరణ

మరోపక్క రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వ్యవసాయ భూములను తహసీల్దార్‌ కార్యాలయాల్లో, వ్యవసాయేతర భూములు, ఆస్తులను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన అనంతరమే రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్‌ వ్యవస్థీకరణ పూర్తి కావాల్సి ఉంది.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మొత్తం సంఖ్యలో మార్పులు లేకున్నా 23 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మాత్రం స్థిరాస్తి కార్యకలాపాలు, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్న నగర ప్రాంతాలకు మారనున్నాయి. వారం రోజులుగా రాష్ట్రంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను కొత్త చట్టం ప్రాతిపదికనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే కొత్త రెవెన్యూ చట్టం శాసనసభలో ఆమోదం పొందింది. మండలి ఆమోదం అనంతరం గెజిట్‌ వెలువడుతుంది. గెజిట్‌ ప్రచురణ తర్వాత రిజిస్ట్రేషన్ల తేదీపై స్పష్టత వస్తుందని రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రంలో 594 తహసీల్దార్‌ కార్యాలయాల్లో 21 చోట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

తాజాగా వ్యవసాయ భూములను తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నిచోట్ల ఇందుకు ఏర్పాట్లు చేయాలో గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌ సహా పూర్తి అర్బన్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ల నుంచి మినహాయించనున్నారు.

అనుసంధానమే కీలకం

రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దార్‌ కార్యాలయాలు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అనుసంధానం చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌తో పాటు రిజిస్ట్రేషన్లకు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయాలి. 2018 మే నెలలో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 21 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. ప్రత్యేకంగా కంప్యూటర్లు, నెట్‌వర్క్‌ అనుసంధానం, రిజిస్ట్రేషన్ల విధానానికి ప్రాతిపదిక అయిన కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:యాదాద్రిలో కోతులకు అరటిపండ్లు అందించిన కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details