దేవాలయాల కూల్చివేతపై ప్రధాని మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాట్లాడే అర్హత లేదని... భాజపా, ఎంఐఎంలు ఇద్దరూ దోషులేనని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్ను వాడుకొని అధికారంలోకి వచ్చారని ఆయన ధ్వజమెత్తారు.
'ఏపీకి రాజధాని లేదు.. తెలంగాణకు సచివాలయం లేదు' - సచివాలయంపై ఎంపీ రేవంత్ వ్యాఖ్యలు
ఏపీకి రాజధాని లేనట్లుగానే....తెలంగాణకు సచివాలయం లేకుండా పోయిందని ఎంపీ రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భాజపా, తెరాస, ఎంఐఎంలపై ఆయన విమర్శలు గుప్పించారు.
గతంలో రాజులు రాజ్యాలపై దాడులు చేసి గెలిచిన తరువాత పాత జ్ఞాపకాలను కూల్చేసేవారని, ఇప్పుడు కేసీఆర్... నిజాం కాలంనాటి పాత కట్టడాలను కూల్చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయంలో దేవాలయం, మసీదుల కూల్చివేత విషయంలో ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు అయ్యేట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎంఐఏం పూర్తిగా తెరాస కనుసన్నల్లోనే నడుస్తోందన్న ఆయన... గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ మొత్తం తీవ్రంగా పరిగణించి పని చేయాలని సమావేశాలకు పరిమితమైతే ప్రయోజనం ఉండదని సూచించారు.