MP Dharmapuri Arvind Shocking Comments on PM Modi : కొత్త ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతో ఆరు గ్యారంటీ(Congress Six Guarantees)ల అమలుపై ప్రజలను అయోమయంలో పడేసిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శ్వేత పత్రాల పేరుతో పరోక్షంగా గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెప్పడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొని, వారిని ఉద్దేశించి మాట్లాడారు.
కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, బీజేపీ సహకారం కచ్చితంగా ఉంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) స్పష్టం చేశారు. అయితే ప్రజలకు మేలు చేసే పనులకు మద్దతిస్తామని, అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తానంటే అంతకంటే గొప్ప ఏముందని, అందుకు తానే ధన్యవాద పాదయాత్ర చేస్తానని అర్వింద్ చెప్పారు.
"నూతన ప్రభుత్వానికి వాళ్లు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టవిటీకి పూర్తిస్థాయిలో మా మద్దతు ఉంటుంది. అయితే తబ్లికీ జమాత్కు రూ.3 కోట్లు ఇవ్వడం వంటి వాటికి మేము వ్యతిరేకం. ప్రజలు అందరికీ సమానంగా పరిపాలన చేసే ఏ కార్యక్రమానికి అయిన మేము సహకరిస్తాం. అయితే ప్రజలకు కాకుండా వేరే పనులకు అధికారాన్ని వినియోగిస్తే వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు డబ్బులు లేవంటే ఊరుకొనే పరిస్థితి లేదు. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి నిజామాబాద్ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే నేను పాదయాత్ర చేస్తాను."- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ