తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫీజులు దండుకుంటున్న కళాశాలలు.. పట్టించుకోని ఇంటర్‌బోర్డు - more fee in corporate colleges

కరోనా పరిస్థితుల్లో కార్పొరేట్‌ కళాశాలలు కొన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజు ఎంత వసూలు చేయాలి? ఎన్ని విడతల్లో తీసుకోవాలి? అన్న నిబంధనలు ఇంటర్‌బోర్డు నుంచి లేకపోవడంతో వాటికి అలుసుగా మారింది. ఈ ఏడాది హాస్టళ్లు నడిచే పరిస్థితి లేకపోవడం...ప్రవేశాల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తుండటంతో చేరిన వారి నుంచి అందిన కాడికి వసూలు చేస్తున్నాయి.

more fee for online classes in corporate colleges
ఫీజులు దండుకుంటున్న కార్పొరేట్ కళాశాలలు.. పట్టించుకోని ఇంటర్‌బోర్డు

By

Published : Jun 25, 2020, 9:21 AM IST

  • హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన ఒకరు తన మేనల్లుడిని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేర్పించేందుకు వెళ్లారు. మొత్తం రుసుం కాకుండా ఆన్‌లైన్‌ తరగతులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు అంటూ రూ.10,500 చెల్లించాలని సిబ్బంది చెప్పారు. కేవలం పుస్తకాలకు రూ.9 వేలు చెల్లించాల్సి వచ్చిందని ఆయన వాపోయారు.
  • ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీరు. ఆయన కుమారుడు జేఎన్‌టీయూహెచ్‌ సమీపంలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో బైపీసీ చదువుతున్నాడు. గత ఏడాది రూ.3 లక్షల ఫీజు అని చివరకు రూ.2.25 లక్షలకు అంగీకరించారు.ఈ ఏడాది రూ.3 లక్షలు చెల్లించాలని, రాయితీ గత సంవత్సరానికేనని చెప్పడంతో ఆ తండ్రి అవాక్కయ్యారు. చేసేది లేక ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామంటే రూ.లక్ష చెల్లించారు. పుస్తకాల కోసం రూ.12,500 ఇచ్చారు. మరో రూ.60 వేలైనా చెల్లించకుంటే ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఉండదని ప్రిన్సిపల్‌ తేల్చి చెప్పారు. ఆయనకు ఏం చేయాలో తెలియని పరిస్థితి.

ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నామని, మీ పిల్లలే వెనకబడిపోతారని తల్లిదండ్రులను మానసికంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఫీజులు ముందస్తుగా అధికంగా లాగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.80 లక్షల మంది ఇంటర్‌ మొదటి ఏడాదిలో చేరుతుండగా కార్పొరేట్‌ కళాశాలల్లో 2.50 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు.

చేతులు దులిపేసుకున్న ఇంటర్‌బోర్డు

తాము అనుబంధ గుర్తింపు ఇచ్చేవరకు ఆన్‌లైన్‌ తరగతులు కూడా నిర్వహించడానికి వీల్లేదని ఇంటర్‌బోర్డు ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అయినా కళాశాలలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఫీజులు చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ తరగతులకు లింకు ఇస్తున్నారు. కొన్ని చోట్ల తరగతులకు అనుమతి ఇచ్చినా వారాంతాల్లో జరిగే పరీక్షలకు కోత పెడుతున్నారు.

పారాహుషార్‌...

పదో తరగతిలో 10జీపీఏ వచ్చిందని, ఎంసెట్‌, నీట్‌ ర్యాంకులు ఖాయమని ఫీజులో రాయితీ ఇచ్చేందుకు అంగీకరిస్తున్న కళాశాలల ప్రిన్సిపాళ్లు రెండో ఏడాది వచ్చేసరికి రాయితీ లేకుండా వసూలు చేస్తున్నారు. మొదటి ఏడాదిలో ప్రవేశాలు పొందేటప్పుడే రెండో ఏడాది ఫీజు ఎంత? ఇంతే ఉంటుందా? పెంచుతారా? అని అడిగి స్పష్టత తీసుకోవాలని కొందరు సీనియర్‌ విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల రెండో ఏడాదికి వచ్చే సరికి ప్రాంగణాన్ని మార్చి వేస్తున్నాయి. దాంతో దూరాభారం అవుతోంది. ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులకు గత మే నెల నుంచే ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించిన ఓ కార్పొరేట్‌ కళాశాల.. హాస్టల్‌ లేకున్నా గత ఏడాది మాదిరిగానే ఫీజు వసూలు చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details