తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీఐ మూసివేతపై కవిత ఆగ్రహం.. భాజపా నేతలకు సూటి ప్రశ్నలు - mlc kavitha questioned bjp leaders over Adilabad CCI industry closure

MLC Kavitha on Adilabad CCI: ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ మూసివేతపై ఎమ్మెల్సీ కవిత... కేంద్రం తీరును తప్పుబట్టారు. సీసీఐ పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం పలుమార్లు చెప్పినా కేంద్రం పెడచెవిన పెట్టడంపై విమర్శలు గుప్పించారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర భాజపా నేతల్ని కోరారు. ఆదిలాబాద్ ప్రాంతంలోని వేలాది యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పరిశ్రమపై కేంద్రం తీరును కవిత దుయ్యబట్టారు.

MLC Kavitha on Adilabad CCI
సీసీఐ మూసివేతపై కవిత ఆగ్రహం

By

Published : May 18, 2022, 5:30 PM IST

MLC Kavitha on Adilabad CCI: 'ఆదిలాబాద్​లో సిమెంట్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలోని బొగ్గు గనుల అమ్మకాలతో వచ్చిన సొమ్మును రాష్ట్రం కోసం వినియోగిస్తారా' అని అడిగే దమ్ము రాష్ట్ర భాజపా నాయకులకు ఉందా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని కలిసి కోరారని... మంత్రి కేటీఆర్ పలు మార్లు ఉత్తరాలు రాశారని కవిత గుర్తు చేశారు. అనేక కుటుంబాలు ఆధారపడిన పరిశ్రమలను మూసివేసి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కవిత ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనకున్న అర్థమేమిటని ప్రశ్నించారు.

సిమెంటు ఫ్యాక్టరీ మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న భాజపాను అడుగడుగునా ప్రశ్నించాలని కవిత సూచించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం... వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఏం చేయబోతున్నారో సమాధానం చెప్పాలని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​లను డిమాండ్ చేశారు. సీసీఐ మూసివేతతో ఆ పరిశ్రమపై ఆధారపడిన 3000 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

'కేంద్రంలోని భాజపా ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులు అమ్ముతోంది. ఆ వచ్చిన డబ్బుతో ఏం చేస్తారో భాజపా నాయకులు సమాధానం చెప్పాలి. ఆ నిధులతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమ పెట్టబోతున్నారా.. లేక కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయబోతున్నారా.? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా.?. సీసీఐ మూసివేతతో వేలాది కుటుంబాలకు ఉపాధి కరవై రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. పునరుద్ధరణ దిశగా కేంద్రంపై భాజపా నాయకులు ఒత్తిడి తీసుకురావాలి' -కవిత, ఎమ్మెల్సీ

ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందన్న విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలని కవిత పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీకి కాంగ్రెస్ ఓ తోక పార్టీగా మారిందని.. రానున్న రోజుల్లో దేశమంతటా అదే పరిస్థితి రానుందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలే సారథ్యం వహిస్తూ.. దేశానికి దిశానిర్దేశం చేస్తాయన్న కవిత.. ప్రాంతీయ పార్టీల విజ‌యంపై కాంగ్రెస్ అసూయ వ్యక్తం చేస్తోందని విమర్శించారు. మెరుగైన పాల‌న‌తోనే ప్రాంతీయ పార్టీలు విజయవంతమయ్యాయని స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ తొలగింపుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

ఇవీ చదవండి:'ఎంత ఖర్చయిన భరిస్తాం... తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం'

'భార్య ఉద్యోగం చేస్తున్నా భరణం తప్పనిసరి'.. విడాకుల కేసులో హైకోర్టు తీర్పు

ABOUT THE AUTHOR

...view details