Mlc Kavitha Fires on Modi: అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అదానీ సంస్థలతో ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోతున్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన మోదీ.. అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
రూ.10 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని.. ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కవిత అన్నారు. మోదీకి ప్రజలపై కన్నా తన పారిశ్రామిక మిత్రులపైనే ఎక్కువ పట్టింపు ఉందన్న విషయం.. ఇవాళ్టి ప్రసంగంతో మరోసారి తేటతెల్లమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి.. పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది 3.87 కోట్ల రైతులకు మాత్రమే ఇచ్చిందని కవిత తెలిపారు.
జగిత్యాల జిల్లాలో 50,000.. నిజామాబాద్ నుంచి 60,000 రైతులను అకారణంగా పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించారని కవిత పేర్కొన్నారు. కానీ ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేశామని.. నిండు సభలో ప్రధాని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే.. అదానీ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుంచి.. 22 వ స్థానానికి పడిపోయారన్నారు. అదానీ గ్రూపులో ఎల్ఐసీ రూ.80,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు.
ఎస్బీఐ నుంచి రూ.27,000 కోట్లు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7,000 కోట్లు, ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని కవిత తెలిపారు. ప్రగతిభవన్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యాలు అన్యాయమని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫ్రస్టేషన్కు ఇదే నిదర్శనమని కవిత పేర్కొన్నారు.