MLA Kotam Reddy Sridhar Reddy: తనపై కక్షసాధింపు చర్యలలో భాగంగా..మానసికంగా హింసించేందుకే ప్రభుత్వం భద్రత తగ్గించిందని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్న సందర్భంలో ఇద్దరు గన్మెన్లను తొలగించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం నాకు 2 + 2 భద్రత కల్పించిందని ఆయన తెలిపారు. శనివారం ఇద్దరు గన్మెన్లను తొలగించారు. ఎవరి ఆదేశాలతో గన్మెన్లను తొలగించారని.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఈ పని చేయరని విమర్శించారు.
ప్రస్తుతం ఇద్దరు గన్మెన్లను తొలగించిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లను తొలగించగా.. మిగతా ఇద్దరి గన్మెన్లను.. తాను ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అన్నారు. ఇద్దరు గన్మెన్లను తొలగిస్తే భయపడనని.. మిగిలిన ఇద్దర్ని గౌరవంగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గన్మెన్ను స్వీకరించలేదని గుర్తు చేశారు.
ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తాను:ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తానని.. ఏం భయపడనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గొంతుకే.. తన గొంతుక అని వివరించారు. సినిమా డైలాగులు చెప్పటం లేదని.. అసలు నిజమిదేనని తగ్గేదేలే అని హెచ్చరించారు. మరింత పట్టుదలతో ముందుకెళ్తానని అన్నారు. 175 సీట్లలో అన్నింటిలో విజయం సాధిస్తామని చెప్తున్నవారు.. ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే మీకు ఇంతా భయమా అని ప్రశ్నించారు. ఒక్కడిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.