MLA Kaushik Reddy Comments on Congress Government :కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన 2,32,308 ఉద్యోగాలు కాకుండా, అదనంగా రెండు లక్షల ఉద్యోగాల నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, కోదండరాం దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన 1,60,083 మందికి వేతనాలు వేయలేదా? అని ప్రశ్నించారు.
అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆలోచించుకోవాలని కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశారు. ఐటీ రంగంలో 60 ఏళ్లలో 3.23 లక్షల ఉద్యోగాలు ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. పరిశ్రమలకు ఒక్క సెకన్ కూడా పోకుండా కేసీఆర్ కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మాణిక్కం ఠాకూర్ గురించి తాము కొత్తగా ఏమీ చెప్పలేదని, వాళ్ల పార్టీ నేతలు కోమటిరెడ్డి సోదరులు అన్న మాటలు మాత్రమే చెప్పామని కౌశిక్రెడ్డి వివరించారు.
'గవర్నర్ పట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి'
EX Speaker Pocharam on Kaleshwaram Projects : పంటలకు సాగునీరు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహనా లోపం ఉందని మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రతి ఏటా 1600 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృధాగా పోతోందని, 30 లక్షల స్థిరీకరణ, 30 లక్షల కొత్త ఆయకట్టు కోసం ప్రాజెక్టుల నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. నిజాం సాగర్ కింద రెండో పంట పడుతోందంటే అది కేసీఆర్ పుణ్యమేనని పోచారం వ్యాఖ్యానించారు. 40 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది తప్ప ఆలోచన చేయడం లేదన్న ఆయన, కాళేశ్వరంలో లోపాలు ఉంటే విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.