తెలంగాణ

telangana

ETV Bharat / state

Talasani srinivas yadav: ''త్వరలోనే 'తెలంగాణ చేపలు' బ్రాండ్​ పేరిట మార్కెటింగ్​'' - minister talasani srinivas yadav review on fisheries marketing

రాష్ట్రంలో 'తెలంగాణ చేపలు' బ్రాండ్​ పేరిట మార్కెటింగ్​ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్​ మసాబ్​ట్యాంక్​లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

minister talasani srinivas yadav
మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్

By

Published : Jul 17, 2021, 7:54 PM IST

Updated : Jul 17, 2021, 10:29 PM IST

రాష్ట్రంలో ఉత్పత్తవుతున్నచేపల కొనుగోళ్లు, మార్కెటింగ్, ఎగుమతుల ప్రక్రియను.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే విషయం పరిశీలిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ మసాబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ కార్యకలాపాలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో చేపల మార్కెటింగ్, సంపద వంటి అంశాలపై అధికారులతో మంత్రి విస్తృతంగా చర్చించారు.

రవాణాకు క్లస్టర్లు

2016-17లో రాష్ట్రంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా... 2020-21 నాటికి 3.49 లక్షల టన్నులకు పెరిగిందని తలసాని అన్నారు. ఉత్పత్తి అయిన చేపల్లో 60 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా... 21 శాతం పశ్చిమ బంగ, మిగిలిన 19 శాతం అసోం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయని వివరించారు. మత్స్య ఫెడరేషన్ కొనుగోలు చేసిన చేపలను.. నాణ్యతా ప్రమాణాలతో 'తెలంగాణ చేపలు' బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు మొబైల్ ఫిష్ ఔట్​లెట్లు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మత్స్య సొసైటీల నుంచి కొనుగోలు చేసిన చేపలను.. 2 లేదా 3 మండలాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.

ప్రాసెసింగ్​ యూనిట్లు

రాష్ట్రం మొత్తం సుమారు 200 వరకు క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు తలసాని వెల్లడించారు. 40 నుంచి 50 క్లస్టర్లకు ఒక ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ అనుసంధానం చేస్తామని చెప్పారు. మొదటగా హైదరాబాద్‌లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లో మత్స్య శాఖకు చెందిన భూముల్లో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మంచి నీటి వనరులు విస్తారంగా ఉన్నందున 365 రోజులు నీరు నిల్వ ఉంటుందని చెప్పారు. మత్స్యకారులు కేవలం వేసవి కాలంలో మాత్రమే చేపల వేట కొనసాగిస్తున్నారని మంత్రి అన్నారు. సంవత్సరం పొడవునా చేపల వేట నిర్వహించేలా.. పట్టిన చేపలు పరిశుభ్రంగా ఉంచేలా వారికి అవగాహన కల్పించాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను తలసాని ఆదేశించారు.

ఇదీ చదవండి:Film Chamber: మంత్రి తలసానితో చలనచిత్ర వాణిజ్య మండలి భేటీ

Last Updated : Jul 17, 2021, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details