దేశవ్యాప్తంగా రైతుల పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టిన బంద్కు రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. భారత్ బంద్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో... ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస శ్రేణులు ఆందోళనలో పాల్గొంటున్నారు.
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెరాస శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని మంత్రి అన్నారు. అన్నదాతలకు పూర్తిగా నష్టం చేకూర్చేలా ఉన్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కర్షకులకు వ్యతిరేకంగా వెళ్లిన ప్రభుత్వాలు గతంలో కనుమారుగయ్యాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తోన్న విధానాలు సరికావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేంద్ర ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతు పండించిన పంటను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోమనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా రైతులు చలిని కూడా లెక్కచేయకుండా దిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా... కేంద్ర ప్రభుత్వానికి కనబడడం లేదా అని విరుచుకుపడ్డారు.
రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం అన్నివేళలా అండగా నిలుస్తుందని హామీనిచ్చారు. అనేక సంక్షేమ పథకాలతో రైతులకు తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తుందని వివరించారు. కొంత మంది కేంద్ర మంత్రులు ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూసి నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని అన్నారు. వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు